పదో తరగతి కూడా పాసవ్వని వ్యక్తికి మంత్రి పదవా?: కొడాలిపై కళా సంచలన వ్యాఖ్యలు

Arun Kumar P   | Asianet News
Published : Jul 12, 2020, 09:44 AM ISTUpdated : Jul 12, 2020, 10:43 AM IST
పదో తరగతి కూడా పాసవ్వని వ్యక్తికి మంత్రి పదవా?:  కొడాలిపై కళా సంచలన వ్యాఖ్యలు

సారాంశం

దేశ అభివృద్దికి వెన్నెముకగా ఉన్న యువత వెన్నెముకను ముఖ్యమంత్రి జగన్ విరుస్తున్నారని టిడిపి ఏపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు మండిపడ్డారు.

గుంటూరు: దేశ అభివృద్దికి వెన్నెముకగా ఉన్న యువత వెన్నెముకను ముఖ్యమంత్రి జగన్ విరుస్తున్నారని టిడిపి ఏపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శాసించే స్ధాయిలో ఉన్న యువతను వైసీపీ ప్రభుత్వం యాచించే స్ధాయికి దిగజార్చిందన్నారు. ఎన్నికల ముందు హోదా తెస్తా, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాని హామీలిచ్చిన జగన్.. ఎన్నికలయ్యాక హోదా గురించి నోరు ఎత్తటం లేదు, నిరుద్యోగ యువత గురించి పట్టించుకోవటం లేదు అని వెంకట్రావు అన్నారు. 

''ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 3 లక్షల ఉద్యోగాలు తొలగించారు. ఇప్పుడు  కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా తొలగించే కుట్ర చేస్తున్నారు.  జగన్ తన 13 నెలల పాలనలో నిరుద్యోగ యువతకు ఒక్క శాశ్వత ఉద్యోగం అయినా ఇచ్చారా? ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా?  రైతులు వర్షం కోసం ఎదురుచూసినట్లు నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు'' అని అన్నారు. 

''పోటీ పరీక్షల శిక్షణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ పొందిన నిరుద్యోగులు నోటిపికేషన్ రాక రోడ్డున పడ్డారు. టీడీపీ హయాంలో ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఈ ప్రభుత్వం  మూసివేయటం వాస్తవం కాదా? నిరుద్యోగులు పొట్టకూటి కోసం ఉద్యోగాల వేటలో  ఉంటే మంత్రులు మాత్రం తమ జేబులు నింపుకునే పనిలో ఉన్నారు. నిరుద్యోగద్రోహి జగన్'' అంటూ వెంకట్రావు మండిపడ్డారు. 

read more   పోలీస్ అధికారి సాయంతోనే... టిడిపి యువకుడి దారుణ హత్య: బోండా ఉమ

''వైసీపీలోని రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి లక్షలాది నిరుద్యోగులను నట్టేట ముంచారు. ఉద్యోగాల భర్తీ అంటే మీ తాబేదార్లను  సలహాదారులుగా నియమించటమా? లేక ఒకే సామాజికవర్గానికి పదవులు కట్టబెట్టడమా? 75 శాతం స్ధానికులకే ఉద్యోగాలు అన్న జగన్ పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారిని సలహాదారులుగా నియమించటం వాస్తవం కాదా? 10 తరగతి కూడా పాసవ్వని కొడాలి నానికి మంత్రిగా ఉద్యోగం ఇచ్చిన జగన్ డిగ్రీ, ఎంబీఎ, బీటెక్ చేసిన వాళ్లని వైన్ షాపుల్లో బేరర్లుగా చేశారు'' అని విమర్శించారు. 

''దేశాన్ని ముందుకు నడిపే యువతను వైసీపీ ప్రభుత్వం మందు షాపులు వైపు నడిపిస్తోంది. ఉన్నత చదువులు చదివి ఉపాధి దొరక్క యువత మద్యానికి బానిసలవుతున్నారు. జగన్ కి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ద నిరుద్యోగులపై  లేదు. ఉద్యోగాలు కల్పించమంటూ నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే  అక్కడ 144 సెక్షన్ పెట్టుకున్నారు. ఇదే  వైసీపీ ప్రభుత్వ వైపల్యానికి అద్దం పడుతోంది'' అని అన్నారు. 

''జగన్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఉద్యోగులకు జీతాలు లేవు. కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా ఏమైంది?  జగన్ ఇప్పటి వరకు 10 సార్లు డిల్లీ వెళ్లారు, ఎన్ని సార్లు కేంద్రం మెడలు వంచారో ప్రజలకు లెక్క చెప్పాలి ? మెడలు వంచేటపుడు విజయసాయిరెడ్డి లెక్కపెట్టడం మరిచిపోయారా?''  అని ఎద్దేవా చేశారు. 

''లాక్ డౌన్ సమయంలో అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే నిరుద్యోగులు ఆకలితో  అలమంటిచే పరిస్థితి ఉండేది కాదు.  నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన నిరుద్యోగ భృతిని రద్దు చేసి జగన్ నిరుద్యోగుల పొట్టకొట్టారు. యువత గురించి పట్టించుకోకుండా రాష్ట్ర భవిష్యత్ ని అంధకారం చేశారు. నాడు రావాలి జగన్ కావాలి జగన్ అన్న వారే నేడు పోవాలి జగన్ అంటున్నారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలతో యువత తిరుగుబాటు చేయటం ఖాయం'' అని కళా వెంకట్రావు పేర్కొన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్ | YS Jagan Attends Iftar Dinner | Asianet News Telugu
దివ్యాంగులతో టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణించిన సీఎం | Divyang Shakti Scheme | Asianet News Telugu