వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని.. పవన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయం మరెంతో దూరంలో లేదని జోస్యం చెప్పారు.
గత కొంతకాలంగా జనసేన ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటుందంటూ.. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. జనసేనతో పొత్తుపై చంద్రబాబు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా.. వీటిపై తాజాగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల పార్థసారధి స్పందించారు.
తమ పార్టీ రాష్ట్రంలో ఏ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. చంద్రబాబు కావాలనే కుట్రపూరితంగా తమ పార్టీ మీద ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. టీడీపీ, వైసీపీల పప్పులు ఉడకవని.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. జనసేనను అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని.. పవన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయం మరెంతో దూరంలో లేదని జోస్యం చెప్పారు.
తమ పార్టీ గుర్తు గాజు గ్లాసుని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.