
అమరావతి: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - జనసేన (TDP Janasena) పార్టీ గతంలో మాదిరిగా కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల ఇరు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (chandrababu), పవన్ కల్యాణ్ (pawan kalyan) ఇటీవల చేసిన వ్యాఖ్యలు టిడిపి - జనసేన పొత్తుపై కొంత క్లారిటీ ఇచ్చాయి. అయితే ఇలా ప్రతిపక్షాలు దగ్గరవుతుండటంతో అధికార వైసిపిలో అలజడి మొదలయింది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ అమ్ముడుపోయాడు, ఆయన చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ వైసిపి నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఈ విమర్శలపై స్పందిస్తూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
''గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల చేత ఛీత్కారాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసి... పరిపాలన చేతగాని సి.బి.ఐ. దత్తపుత్రుడయిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైంది. నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పడమే ఆయనకు తెలిసిన విద్య. పాదయాత్రలో ముద్దులు పెడుతూ నోటికొచ్చిన హామీలు గుప్పించి, మేనిఫెస్టోలో ఎడాపెడా చెప్పేసి తీరా వాటి గురించి అడిగితే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడేమో 95 శాతం హామీలు నెరవేర్చాను అని మరో పెద్ద అబద్ధం చెప్పారు'' అని నాదెండ్ల ఆరోపించారు.
''రాష్ట్రంలో మత్స్యకార భరోసాకు అర్హత ఉన్న కుటుంబాల్ని కూడా ఎందుకు పథకానికి దూరం చేశారో చెప్పాలి. 2021లో లక్షా 19వేల మందికి ఇస్తున్నామని చెప్పారు. 2022లో ఆ సంఖ్య లక్షా 8 వేలకు తగ్గించిన మాట వాస్తవం కాదా? జీవో 217 ద్వారా మత్స్యకారులను చేపల చెరువులకు ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలి'' అని నిలదీసారు.
''మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ గారి పేరు పలికే అర్హత సి.బి.ఐ. దత్తపుత్రుడికి ఉందా? ఆయన దానం చేసిన ఆస్తులను, భూములను వైసీపీ వాళ్ళు కబ్జాలు చేస్తున్న విషయం జగన్ రెడ్డికి తెలియదా? ఎం.ఎస్.ఎన్. ఛారిటీస్ కి సంబంధించిన భూమి తీసేసుకొని వైసీపీ జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మించడానికి సిద్ధమైనవాళ్ళా ఆ మహాదాత గురించి చెప్పేది'' అంటూ నాదెండ్ల మండిపడ్డారు.
''వైసీపీ మేనిఫెస్టోలో చెప్పిన మద్య నిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలి. ఊరూరా మద్యం ఏరులై పారుతోంది. ప్రతి యేటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువతను మభ్యపెట్టారు. ఈ మూడేళ్లలో ఇచ్చింది ఒక క్యాలెండర్... అదీ అరకొర ఉద్యోగాలు. వాటికి ఇప్పటికీ నోటిఫికేషన్లు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు సి.పి.ఎస్. రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని మాట తప్పారు. అవగాహన లేక ఆ హామీ ఇచ్చామని సకల శాఖల మంత్రితో చెప్పించి మోసం చేసిన విషయాన్ని ఒప్పుకొన్నారు. ఆత్మహత్య చేసుకొన్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు రూ.7 లక్షలు ఇస్తామని చెప్పి... వాటిని ఎగ్గొట్టే పనిలో ఉన్నారు'' అంటూ నాదెండ్ల ఆరోపించారు.
''వైసీపీ దారుణ పాలన చూసే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఉన్న పరిశ్రమలు కూడా మూసేసుకొని పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. విద్యుత్ సంక్షోభం, రోడ్ల దుస్థితి కళ్ళెదుట కనిపిస్తున్నాయి. ఈ విషయాల గురించి ప్రజలు నిలదీస్తుంటే జగన్ రెడ్డి సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు'' అన్నారు.
''మరో వైపు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను మా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుంటే వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. సి.బి.ఐ. దత్తపుత్రుడు, ఆయన అనుచరులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. చేతనైతే బాధల్లో ఉన్న రైతాంగం కన్నీరు తుడవండి. సి.పి.ఎస్. రద్దు చేయండి. పెట్టుబడులు తీసుకురండి.. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. అర్థంపర్థంలేని విమర్శలు కట్టిపెట్టకపోతే ప్రజలే బలంగా సమాధానం చెబుతారు'' అని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.