ఏపీలో మరో విషాదఘటన: సర్వజన ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం

By telugu teamFirst Published Aug 26, 2020, 10:02 AM IST
Highlights

ఏపీలో మరో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అనంతపురం సర్వజన ఆస్పత్రిలో గత అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అయితే, ప్రాణనష్టం సంభవించలేదు. కరోనా రోగులను ఇతర వార్డులకు తరలించారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం సర్వజన ఆస్పత్రి ఐడి వార్దు వద్ద అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో కొన్ని రికార్డులు కాలిపోయాయి. కరోనా వార్డులోని బాధితులను హుటాహుటిన ఇతర వార్డలకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి, ఎస్పీ సత్యా ఏసుబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.  

వైరింగ్ పాతది కావడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక శాఖ కార్యాలయం ఆస్పత్రి ఎదురుగానే ఉంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించారు. ఆస్పత్రిలోని రికార్డు రూంలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ తో ప్రమాదం సంభవించింది. ప్రాణ నష్టం జరగలేదు.

సమాచారం తెలిసిన వెంటనే ఆళ్ల నాని అనంతపురం జిల్లా కలెక్టరుతోనూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోనూ ఫోన్ లో మాట్లాడివివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి రికార్డు రూమ్ పక్కన ఉన్న వార్డుల్లో 24మంది  కరోనా పేషంట్స్ ను తక్షణమే అర్ధో వార్డుకు తరలించాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ ను మంత్రి అదేశించారు. 

ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందోస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు మంత్రి ఆళ్ల నాని ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా, లేదా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆయన సూచించారు.

click me!