గుంతకల్ జంట ఆత్మహత్యలు : సోదరి వరసయ్యే మహిళపై మోజు.. చివరికి...

By AN TeluguFirst Published Aug 6, 2021, 11:36 AM IST
Highlights

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని ఇమాంపురం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి (38), గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి (40) వరుసకు అన్నాచెల్లెళ్లు. గురువారం గుంతకల్లు శివారులోని హనుమాన్‌ సర్కిల్‌ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. 

గుంతకల్లు : వారిద్దరికీ వివాహాలయ్యాయి.. ముద్దులొలికే ముత్యాల్లాంటి పిల్లలున్నారు. చక్కటి భర్త, భార్యలున్నాయి. హాయిగా సాగిపోయే సంసారాలున్నాయి. కానీ.. ఒకరిమీద ఒకరికి మోజు ఏర్పడింది. అది వావివరసల్ని కూడా మరిచేలా చేసింది.. వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారన్నా విషయాన్నీ మరిచిపోయి.. శారీరక సంబంధంలోకి దిగారు. కొద్దికాలం బాగానే సాగింది. ఆ తరువాతే వారి సంబంధం విషయం ఇంట్లో తెలిసింది... ఆ వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. చివరికి...

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని ఇమాంపురం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి (38), గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి (40) వరుసకు అన్నాచెల్లెళ్లు. గురువారం గుంతకల్లు శివారులోని హనుమాన్‌ సర్కిల్‌ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. 

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివారెడ్డి తనకు సోదరిలాంటి రాజ్యలక్ష్మితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ క్రమంలో వారం కిందట వీరి విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. దీంతో కుటుంబీకులకు ముఖం చూపించడం ఇష్టం లేక వారిద్దరూ మూడు రోజుల కిందట ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. 

భార్య కనిపించడం లేదని రాజ్యలక్ష్మి భర్త నారాయణస్వామి గుంతకల్లు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి తన భార్యకు ఫోన్ చేసిన శివారెడ్డి, తానిక ఇంటికి రాలేనని, ఇవే తన చివరి మాటలని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఆ ఫోన్‌ కూడా పనిచేయలేదు. 

తీరా గురువారం రాజ్యలక్ష్మి, శివారెడ్డి మృతదేహాలు హనుమాన్ సర్కిల్ సమీపంలోని రైలు పట్టాలమీద ఛిద్రమై కనిపించాయి. స్థానికుల సమాచారంతో జీఆర్పీ సీఐ నగేష్ బాబు, ఎస్ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు విషయం చేరవేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 

మృతదేహాలను పోలీసుల గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా రాజ్యలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు సంతానం ఉన్నారు. కాగా, శివారెడ్డికి కూతురు, కొడుకు ఉన్నారు.
 

click me!