
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కాలజ్ఞానం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన ప్రజల్ని తూటాలతో బలిగొన్న విజనరీ చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, నమ్మండి అంటూ చంద్రబాబు చెబుతున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. విజన్ 2047 అంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారని.. చంద్రబాబు విజన్ 2020తో ఏం పొడిచారని పేర్ని నాని ప్రశ్నించారు. నాడు ఉచిత విద్యుత్పై ఆయన వెటకారంగా మాట్లాడారని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు.
చంద్రబాబుది సుత్తి విజన్ అని.. ఆయన విజనరీ ప్రాజెక్ట్లు పూర్తి చేయలేకపోయిందన్నారు. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశానని చెప్పుకునే దమ్ముందా అని నాని ప్రశ్నించారు. కనీసం కుప్పానికి చంద్రబాబు నీళ్లు ఇచ్చారా అని ఆయన నిలదీశారు. చంద్రబాబుది దిక్కుమాలిన విజన్ అని.. ప్రాజెక్ట్ల సందర్శన పేరుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారని నాని మండిపడ్డారు. అవగింజంత కూడా సిగ్గులేని వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు. ఎవరిని మోసం చేయడానికి ప్రాజెక్ట్లను సందర్శిస్తున్నారని నాని నిలదీశారు. చంద్రబాబు తెచ్చిన పథకం కనీసం ఒక్కటైనా వుండా అని ప్రశ్నించారు. విజన్ పబ్లిసిటీ తప్ప చంద్రబాబుకు వుందా అని నాని ఎద్దేవా చేశారు.