టీడీపీలోకి మాజీమంత్రి డీఎల్: సాయంత్రం చంద్రబాబుతో భేటీ

By Nagaraju penumalaFirst Published Feb 20, 2019, 3:04 PM IST
Highlights

అక్కడ బెడిసికొట్టడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వైసీపీలో కూడా టికెట్ పై హామీ ఇవ్వకపోవడంతో ఆ పార్టీలోకి వెళ్లకుండా అలా ఉండిపోయారు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఇక సైకిలెక్కాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే తటస్థులు రాజకీయ భవిష్యత్ కోసం దారులు వెతుక్కుంటున్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కీలక నేతలు గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 

అయితే ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వారంతా రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది ఆయా పార్టీల్లో చేరిపోతే మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం అటు ఇటూ కాకుండా ఎటూ తేల్చుకోలేకపోయారు. గతంలో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 

అక్కడ బెడిసికొట్టడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వైసీపీలో కూడా టికెట్ పై హామీ ఇవ్వకపోవడంతో ఆ పార్టీలోకి వెళ్లకుండా అలా ఉండిపోయారు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఇక సైకిలెక్కాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. 

వైసీపీ నుంచి దారులు మూసుకుపోవడంతో ఇక టీడీపీతోనే టచ్ లో ఉన్నారు.  టికెట్ పై హామీ రాకపోవడంతో వేచి చూస్తున్న ఆయనకు సీఎం చంద్రబాబు నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. మైదుకూరు అసెంబ్లీ సీటుపై డీఎల్ కు క్లారిటీ ఇచ్చేందుకు చంద్రబాబు ఆహ్వానం పలికారని సమాచారం. 

మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేద్దామని భావించారు. 

అప్పటికే తెలుగుదేశం టికెట్ ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కి కన్ఫమ్ అవ్వడంతో చంద్రబాబు నో చెప్పారు. దీంతో ఆయన 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరదామని భావించారు. 

అప్పటికే మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురామిరెడ్డి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు జగన్ అంగీకరించారని తెలిసింది. అయితే అసెంబ్లీ టికెట్ కావాలని డీఎల్ కోరడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ టికెట్ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు.

దీంతో ఆయన అటు తెలుగుదేశం పార్టీలోకి గానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గానీ చేరకుండా కొంతకాలంగా తటస్థంగా ఉండిపోయారు. అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన రాజకీయభవిష్యత్ దృష్ట్యా మళ్లీ టీడీపీతో టచ్ లోకి వచ్చారు. 

డీఎల్ రవీంద్రారెడ్డికి టికెట్ ఇస్తే మైదుకూరులో టీడీపీ గెలిచే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారని తెలుస్తోంది. 

టీటీడీ చైర్మన్ పదవి ఉన్నప్పటికీ పుట్టా సుధాకర్ యాదవ్ తాను మైదుకూరు నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో డీఎల్ రవీంద్రారెడ్డి కాస్త వెనక్కి తగ్గారు. సీఎం చంద్రబాబు నాయుడు, జిల్లా టీడీపీ నాయకత్వం పుట్టా సుధాకర్ యాదవ్ ను బుజ్జగించడంతో టికెట్ పై వెనక్కి తగ్గారని తెలుస్తోంది. మైదుకూరు టికెట్ పై బుధవారం సాయంత్రం చంద్రబాబు క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.   
 
ఇకపోతే బుధవారం సాయంత్రం కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలి అనే అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చెయ్యనున్నారు. అదే సమయంలో డీఎల్ చేరికపై కూడా పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. సభ్యుల అభిప్రాయం తీసుకోనున్నట్లు సమాచారం. 

click me!