అధునాతన డ్రోన్లతో సర్వే... భూ వివాదాల పరిష్కారం దిశగా సీఎం జగన్ కీలక నిర్ణయం

Arun Kumar P   | Asianet News
Published : Mar 31, 2022, 02:47 PM IST
అధునాతన డ్రోన్లతో సర్వే... భూ వివాదాల పరిష్కారం దిశగా సీఎం జగన్ కీలక నిర్ణయం

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భూ వివాదాల పరిష్కారిపై జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ పథకాన్నిచేపట్టిన విషయం తెలిసిందే. దీని అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఆయన అధికారులతో సమావేశమయ్యారు. 

అమరావతి: వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ పథకంపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష చేపట్టారు. క్యాంప్‌ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమైన సీఎం ఈ పథకం అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. భూ సర్వే కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి అధికారులు సీఎం కు వివరించగా... సీఎం కూడా అధికారులు తగు సూచనలు చేసారు. ఈ సందర్భంగా సమగ్ర భూసర్వే కోసం ఉపయోగించే అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్లను సీఎం జగన్ పరిశీలించారు. డ్రోన్ల పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. 

ఏప్రిల్‌ 5 కల్లా భూ సర్వేకోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమై ఉంటాయిని అధికారులు సీఎంకు తెలిపారు. మరింత వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. మొత్తంగా భూ సర్వే కోసం 154 డ్రోన్లను వినియోగించనున్నట్లు అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.

ఇప్పటివరకూ 1441 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి చేసినట్లు... వర్షాకాలం వచ్చేలోగా వీలైనంత మేర డ్రోన్‌ సర్వే నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్నామని అధికారులు తెలిపారు. రెవిన్యూ విలేజ్‌ చొప్పున సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అధికారులు తెలిపారు.

వీలైనంత తొందరగా సర్వే ఫలితాలు పూర్తిగా అందేలా, అదే సమయంలో రికార్డుల స్వఛ్చీకరణ చేపట్టేలా ఏర్పాట్లు చేసామని అధికారులు సీఎంకు వివరించారు. వెబ్‌ ల్యాండ్‌ అప్‌డేషన్, గ్రామ ల్యాండ్‌ రిజిస్టర్‌ అప్‌డేషన్, గ్రామ ఖాతా రిజిస్టర్ తో పాటు జగనన్న భూ హక్కు పత్రం కూడా ఇవ్వనున్న అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయాల వారీగా భూ వివరాలను అప్‌డేషన్‌ చేయనున్నామన్నారు. దీనివల్ల గతంలో వెబ్‌ల్యాండ్‌ సందర్భంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం వస్తుందన్న అధికారులు సీఎంకు తెలిపారు.

రాష్ట్రంలోని 5200 గ్రామాల్లో 2023 జులై నెలాఖరుకు, 5700 గ్రామాల్లో 2023 ఆగస్టు నెలాఖరు కల్లా, సెప్టెంబరు నెలాఖరు నాటికి మరో 6460 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేలా కార్యాచరణ పూర్తిచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఓఆర్‌ఐ (ఆర్థోరెక్టిఫైడ్‌ రాడార్‌ ఇమేజెస్‌) చిత్రాల ప్రక్రియ మొదటి విడత గ్రామాల్లో ఈ ఏడాది నవంబర్‌ నెలాఖరు నాటికి, రెండో విడత గ్రామాల్లో డిసెంబర్‌ నెలాఖరు నాటికి, మూడోవిడత గ్రామాల్లో జనవరి నెలాఖరు నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ కూడా అధికారులకు పలు సూచనలు చేసారు. గతంలో వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. అత్యంత పారదర్శక పద్ధతుల్లో ఇది జరగాలని... దీంట్లో అనుసరించాల్సిన విధానాలు, ఎస్‌ఓపీలను తయారు చేయాలని సీఎం ఆదేశించారు. రికార్డులను ఎవ్వరూ మార్చలేని విధంగా, టాంపర్‌ చేయలేని విధంగా చేయాలన్నారు సీఎం జగన్. 

కేవలం  ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్‌ రికార్డులు కూడా తయారుచేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ ఫిజికల్‌ డాక్యుమెంట్‌ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. సబ్‌ డివిజన్‌ కోసం దరఖాస్తు చేసిన వెంటనే సర్వే జరిగేలా చూడాలని సూచించారు. ఈ క్రమంలో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా వుండాలన్నారు. లంచాలకు తావులేకుండా ఈ వ్యవస్థ నడవాలన్నారు. అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలని... ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఉన్నతాధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 

''భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలి. దీనివల్ల స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయి. భూ యజమానులకు క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేనాటికి దాదాపుగా వివాదాలు లేకుండా చూడాలి. ఇందులో భాగంగా న్యాయశాఖను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. దీనిపై ఓ రోడ్‌మ్యాప్‌ను కూడా తయారు చేయాలి'' అని సీఎం సూచించారు.

''భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో  దేశానికే ఒక దిక్సూచిగా రాష్ట్రం నిలవాలి. అందుకోసమే సీనియర్‌ అధికారులు, మంత్రులను ఇందులో భాగస్వాములుగా చేశాం. కాబట్టి పకడ్బందీగా భూసర్వే చేపట్టి రికార్డులను రూపొదించాలి'' అని సీఎం జగన్ సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం,  సీఎస్‌ సమీర్‌ శర్మ, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రెవెన్యూశాఖ కమిషనర్‌ సిద్దార్ధ జైన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Chitha Vijay Prathap Reddy: ఫుడ్ కమిషన్ చైర్మన్ కే పంచ్ లు నవ్వు ఆపుకోలేకపోయిన అధికారులు| Asianet
Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu