
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు లేఖ రాశారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పలుచోట్ల వైసీపీ నేతలతో ఎన్నికల అధికారులు కుమ్మక్కు కావడంతో భారీగా బోగస్ ఓట్లు నమోదయ్యాయని సీఈసీకి ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల జాబితాను చంద్రబాబు నాయుడు తన లేఖకు జతచేశారు. బోగస్ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో తిరుపతి లోక్సభ ఉపఎన్నిక సమయంలో కూడా బోగస్ ఓట్ల తంతు నడిచిందని అన్నారు.
తప్పుడు చిరునామాలతో వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లను చేర్చారని అన్నారు. తిరుపతిలో ఓకే ఇంటి చిరునామాతో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేశారని చెప్పారు. కొందరు అధికారులు నకిలీ పత్రాలను పరిశీలించకుండానే.. ఉద్దేశపూర్వకంగానే వాటికి ఆమోదం తెలిపారని ఆరోపించారు. బోగస్ ఓట్లపై విచారణ జరపాలని సంబంధిత జిల్లా కలెక్టర్ను ఏపీ ప్రధాన ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
బోగస్ ఓట్లతో ప్రజాస్వామ్యానికి, ప్రాథమిక హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకుని.. అక్రమాలను అడ్డుకోవాలని సీఈసీని చంద్రబాబు కోరారు. బోగస్ ఓట్లు నమోదు చేసిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో చంద్రబాబు కోరారు.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భోగస్ ఓట్లతో అధికార వైసీపీ లబ్ది పొందాలని చూస్తుందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల్లో దొంగ ఓట్లను సృష్టించడం, ఓటర్లను ప్రలోభ పెట్టడం వంటి అక్రమాలతో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని.. దీనిపై ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. టీడీపీ అభ్యర్థులు చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్గోపాల్రెడ్డిలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 2014లో అధికారంలోకి వచ్చాక అనేక సవాళ్లను అధిగమించామని చెప్పారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పారిపోయి, ఏపీలో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు. నేడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్తో అవగాహనకు వచ్చామని చంద్రబాబు తెలిపారు.మొదటి ప్రాధాన్యతా ఓటు తెలుగుదేశం బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు వేసి.. రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి ఓటు వేయకూడదని అన్నారు.