రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీనియర్లతో చంద్రబాబునాయుడు మరికాసేపట్లో సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే చంద్రబాబునాయుడు నివాసానికి టీడీపీ నేతలను పోలీసులు అనుమతించడం లేదు.
అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీనియర్లతో చంద్రబాబునాయుడు మరికాసేపట్లో సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే చంద్రబాబునాయుడు నివాసానికి టీడీపీ నేతలను పోలీసులు అనుమతించడం లేదు.
చంద్రబాబు నివాసానికి పక్కనే ప్రజా వేదిక ఉంది. ఈ ప్రజా వేదికను మంగళవారం రాత్రి నుండే కూల్చివేస్తున్నారు. రెండు జేసీబీల సహాయంతో ఈ పనులు సాగుతున్నాయి.ఇవాళ సాయంత్రానికి కూల్చివేత పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
ప్రజా వేదికను కూల్చివేయడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు.ఈ భవనాన్ని తనకు ఇవ్వాలని చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. కానీ, ప్రజా వేదికను నిబంధనలను ఉల్లంఘించి నిర్మించారని సీఎం జగన్ చెప్పారు. ఈ భవనాన్ని కూల్చివేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని అక్రమ భవనాలను కూల్చివేయనున్నట్టు జగన్ తేల్సి చెప్పారు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు పార్టీ సీనియర్లతో మరికాసేపట్లో బాబు సమావేశం కానున్నారు.
ప్రజా వేదికను కూల్చివేస్తున్నందున చంద్రబాబు నివాసం వైపు ఎవరిని కూడ అనుమతించడం లేదు. చంద్రబాబు నివాసానికి వెళ్లడానికి ప్రజా వేదిక ముందు నుండి వెనుక నుండి రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చంద్రబాబు నివాసానికి వెళ్లేందుకు టీడీపీ నేతలకు పోలీసులు అనుమతించడం లేదు. చంద్రబాబు నివాసంలో సమావేశం పేరుతో వెళ్లే పేరుతో ప్రజా వేదిక కూల్చివేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేసే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కారణంగానే పోలీసులు టీడీపీ నేతలతో పాటు సామాన్యులను కూడ ఈ వైపుకు అనుమతించడం లేదు. అయితే చంద్రబాబు నివాసానికి పోలీసుల కళ్లుగప్పి కొందరు నేతలు బాబు నివాసానికి చేరుకొన్నారు.