
ఆంధ్రప్రదేశ్, తెలంగాలలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్రం సమాధానమిచ్చింది. అసెంబ్లీ స్థానాల పెరుగుదలకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్రం పేర్కొంది. అసెంబ్లీ స్థానాల పెరగాలంటే.. 2026 వరకు వేచి చూడాల్సిందేనని తెలిపిందే. అప్పటివరకు ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంట్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. గతంలో కూడా కేంద్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెరుగుదలకు సంబంధించి పలుమార్లు చర్చలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. కేంద్రం అసెంబ్లీ స్థానాల పెరుగుదలపై కసరత్తు ప్రారంభించిందనే ప్రచారం కూడా సాగుతూనే వస్తుంది. అయితే కేంద్రం మాత్రం తాము తక్షణమే అలాంటి ప్రక్రియ చేపట్టడం లేదని క్లియర్గా చెబుతోంది. గత ఏడాది కూడా పార్లమెంట్ వేదికగా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2026 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి వాటిల్లో సీట్లు పెంచే ఆలోచన తక్షణమే లేదని కేంద్రం పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం, 2026 తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య పెంపు ఉంటుందని తెలిపింది. ‘‘“ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి, ఈ చట్టంలోని సెక్షన్ 15 ఎటువంటి పక్షపాతం లేకుండా.. ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 స్థానాలకు పెంచబడతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం, 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తర్వాత ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య తిరిగి సర్దుబాటు చేయబడుతుంది’’ అని కేంద్రం చెప్పింది. కేంద్రం చెబుతున్న రూల్స్ ప్రకారం 2031 జనాభా గణన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెరుగుదల లేనట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.