ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిందే: జీవీఎల్ సంచలనం

By Siva KodatiFirst Published Dec 13, 2020, 4:19 PM IST
Highlights

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాలన్న ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. ఏపీలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాలన్న ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌లో క్రిస్మస్ సంబరాలపై మండిపడ్డారు. ఈ సంఘటన ప్రభుత్వమే మత ప్రచారం నిర్వహిస్తున్నట్టుగా ఉందని జీవీఎల్ ఆరోపించారు.

పోలీస్ స్టేషన్‌లో దసరా సంబరాలు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికలో రెండు పార్టీలకు బుద్ధి చెబుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నిధులు ఉన్నాయని, పెట్టుబడి అంతా నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనని నరసింహారావు పేర్కొన్నారు.

గత టీడీపీని, ఇప్పటి వైసీపీ సర్కార్‌లు వాళ్లు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి వేదికగా తన ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. లౌకిక పార్టీల పేరుతో టీడీపీ, వైసీపీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని జీవీఎల్ ఆరోపించారు.

రైతు చట్టాలపై వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీలవి ద్వంద్వ వైఖరని ఆయన మండిపడ్డారు. రైతు చట్టాలపై అవగాహన కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని నరసింహారావు పేర్కొన్నారు. 

click me!