వైఎస్ రాజారెడ్డిని హత్య చేయించింది బాబే: భూమన

By pratap reddyFirst Published Oct 26, 2018, 3:32 PM IST
Highlights

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

హైదరాబాద్‌: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్ ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించే సంస్కారం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి డ్రామా అని వ్యాఖ్యానిస్తున్న చంద్రబాబు మానవ మృగంలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. 

విద్యార్థి దశ నుంచే చంద్రబాబుకు నేర చరిత్ర ఉందని ఆయన అన్నారు. వంగవీటి రంగా హత్య కుట్రలో చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. చంద్రబాబు గతం, వర్తమానం రెండూ రక్తసిక్తమేనని అన్నారు.

వైఎస్‌ రాజా రెడ్డిని హత్య చేయించింది కూడా చంద్రబాబేనని భూమన వ్యాఖ్యానించారు. వైఎస్‌ రాజారెడ్డిని హత్య చేసిన హంతకులకు చంద్రబాబు నెల రోజులు ఆశ్రయమిచ్చారని ఆరోపించారు. అటువంటి వ్యక్తి నేడు శాంతి వచనాలు వల్లించడం దారుణమని ఆయన విమర్శించారు. కుల రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడని అన్నారు. 

ఎన్‌కౌంటర్‌ పత్రికాధిపతి పింగళి దశరథ్‌రామ్‌ హత్యలో కూడా చంద్రబాబు ప్రమేయముందని భూమన అన్నారు. 2003 అలిపిరి ఘటనను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని చెప్పారు. ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి చంద్రబాబును పరామర్శించి దాడిని ఖండించారని భూమన గుర్తు చేశారు.

click me!