రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాధనంతో విలాసాలు చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.
విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాధనంతో విలాసాలు చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. కేవలం ఆయన రాజభవనాల సోకులకే రాష్ట్ర బడ్జెట్ సరిపోయేలా లేదంటూ ఎద్దేవా చేశారు.
''వామ్మో అది ఇల్లా? మాయా మహలా? ఎన్నికల ముందే నిర్మాణం పూర్తయ్యింది అన్న వైఎస్ జగన్ తాడేపల్లి రాజ ప్రసాదంలో కరెంటు పనికి 3.63 కోట్ల బిల్లా? సోఫాలు, కుర్చీలకు 39 లక్షలా? ఒక్క రూపాయి జీతగాడు జగన్ రెడ్డి రాజ భవనాల సోకులకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోయేలా లేదు'' అంటూ ఎద్దేవాచేశారు అయ్యన్నపాత్రుడు.
''రంగులు, హంగులు, సోకులకు ప్రజా ధనం వృధా చెయ్యడం ఆపి, మీరు ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యండి జగన్ రెడ్డి గారు!!'' అంటూ ట్విట్టర్ ద్వారా సూచించారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.
read more భారీగా పెరిగిన వైసిపి నడిమంత్రపు సిరి... కారణమదే: యనమల రామకృష్ణుడు
ఇదే విషయంపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా స్పందిస్తూ సీఎం జగన్ పై మండిపడ్డారు. ''రాజ భవనానికి ప్రజల సొత్తుతో సోకులు. ప్రజా ధనంతో దుబారా సబబు కాదు వైఎస్ జగన్ గారు. మంచినీళ్లు, మజ్జిగ కోసం కోటి, కరెంట్ పని, కుర్చీల కోసం 4 కోట్లు. మంది సొమ్ముతో విలసాలు ఏంటి? ఊరికో రాజ భవనం నిర్మించుకోవడం మీకు ఫ్యాషన్ అయినా వాటిని నిర్వహించే స్తోమత రాష్ట్ర ప్రజలకు లేదు జగన్ రెడ్డి గారు'' అంటూ ఆర్ఆండ్బి శాఖ విడుదల చేసిన జీవోను జతచేస్తూ వెంకన్న ట్వీట్ చేశారు.
''వామ్మో ఈ దోపిడీ ఏంటి జగన్ గారు?బాబు గారు తన సొంత ఖర్చులతో హిమాలయా వాటర్ బాటిల్ తెచ్చుకుంటేనే గోల గోల చేసారు.. ఇప్పుడు ప్రజాధనంతో మీరు చేస్తున్న దుబారాకి ఎం సమాధానం చెబుతారు?'' అంటూ ఇదివరకే ఇదే ట్విట్టర్ వేదికన వెంకన్న ప్రశ్నించిన విషయం తెలిసిందే.
''విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న జగన్ రెడ్డి వాటర్ బోటిల్, మజ్జిక ప్యాకెట్ ల కోసం, 43.44 లక్షలు స్వాహా జగన్ గారి ప్రమాణ స్వీకారానికి, ఇప్పటికీ డబ్బులు విడుదల చేస్తూనే ఉన్నారు. వాటర్ బాటిల్స్, స్నాక్స్ కోసం,59.49 లక్షలు స్వాహా'' అంటూ మరో ట్వీట్ చేశారు.