అయ్యన్న ఇంటిని కూల్చివేత... ఏ అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు: అచ్చెన్న స్ట్రాంగ్ వార్నింగ్

By Arun Kumar PFirst Published Jun 23, 2022, 5:07 PM IST
Highlights

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతలో పాల్గొన్న అధికారులకు టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బలహీన వర్గాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని... మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిని కూల్చడం ఆ వర్గాలపై జరిగిన దాడిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు  అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి ఇంటిని అర్థరాత్రి వేళ నిబంధనలకు విరుద్ధంగా కూల్చి కక్షసాధింపు చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అచ్చెన్న అన్నారు.  

''అసలు జగన్ రెడ్డికి అయ్యన్న కుటుంబ చరిత్ర తెలుసా? వారి తాత, తండ్రి సొంత భూములను ప్రభుత్వాలకు దానం చేసి అనేక సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యన్న కూడా కావాల్సిన అన్ని అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించుకున్నారు. బలహీన వర్గానికి చెందిన ఆయన కుటుంబం పట్ల అమానుషంగా ప్రవర్తించారు. అర్థరాత్ర వేళ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇంటిని కూల్చడాన్ని ప్రజలందరూ గమనించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. జగన్ రెడ్డి తన అవినీతిని ప్రశ్నించిన వారందరిపై దాడులు చేసి ఇబ్బందులకు గురిచేసిన విధానాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు'' అని అచ్చెన్న హెచ్చరించారు. 

Video

''ఐపీఎస్ ఆఫీసర్ వీఎన్ మణికంఠ, ఆర్డీవో గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఎమ్మార్వో జయగారికి రాజ్యాంగంపై కనీస పరిజ్ఞానం ఉందా? నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మిస్తే 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. వీరెవ్వరికీ ఈ నిబంధనలు తెలియవా? అర్థరాత్రి ఇంటిని కూల్చడానికి నిమిషం ముందు నోటీసు ఇవ్వడంపై సమాధానం చెప్పాలి'' అని నిలదీసారు. 

''ఐపిఎస్ అధికారి మణికంఠకి చట్టాలు తెలుసా? 300ఏ ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి కూల్చివేతలు వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ ఆదేశాలు అమలు చేసే బాధ్యత లేదా? ఆర్డీవో చెప్పారు... తాను చేశానని మణికంఠ చెప్పడం సిగ్గుచేటు. అసలు నువ్వు ఐపీఎస్ చదువుకోలేదా? ఆర్డీవో మౌఖిక ఆదేశాలు ఇస్తే లిఖిత పూర్వక ఆదేశాలు అడగాల్సిన బాధ్యత లేదా? మీ సతీమణి కూడా డీసీపీగా పనిచేస్తున్నారు. ఎమ్మార్వో జయగారు, ఆర్డీవో గోవిందరావు, కమిషనర్ కనకారావు, ఐపీఎస్ మణికంఠ ఇళ్లను అర్థరాత్రి వేళ జేసీబీలతో కూలిస్తే మీకు బాధ ఉండదా?'' అంటూ మండిపడ్డారు. 

''ఐపిఎస్ మణికంఠ తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాలో ఉంటారు. వారి ఇంటిని అర్థరాత్రి వేళ జేసీబీలతో కూలిస్తే మీకు బాధ ఉండదా? ఈ మూడేళ్లలో వైసీపీ నేతలు చెప్పారని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదు. మణికంఠ తల్లిదండ్రులకు కూడా లేఖ రాస్తాం. ఈ పరిస్థితే వారికి వస్తే వారెంత బాధపడతారో లేఖ రాస్తాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి.. వ్యతిరేక కార్యక్రమాల్లో భాగస్వాములైన అధికారులకు లేఖలు రాసి.. భవిష్యత్ లో టీడీపీ అధికారలోకి వస్తే వీరిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 
 

click me!