చంద్రబాబు‌లా జగన్‌కు షో చేయడం రాదు.. టీడీపీ వేసే ముష్టి సీట్ల కోసం పవన్ ఆశపడొద్దు : అంబటి రాంబాబు

By Siva KodatiFirst Published Dec 10, 2023, 6:20 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ప్రతి సంక్షోభాన్ని రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబులా షో చేయడం జగన్‌కు అలవాటు లేదని మంత్రి చురకలంటించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ఆదివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుఫాన్‌పై ప్రభుత్వ ముందస్తు చర్యలతో తీవ్రనష్టం తప్పిందన్నారు. ఈ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్‌లు కట్టింది వైఎస్సార్ అని రాంబాబు తెలిపారు. బాధితులను సీఎం పరామర్శించడాన్ని కూడా చంద్రబాబు తప్పుబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హెక్టార్‌కు రూ.17 వేలు నష్టపరిహారం ఇస్తున్నామని.. గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది కూడా వైఎస్సారేనని రాంబాబు చెప్పారు. తుఫాన్‌లు వచ్చినప్పుడు చంద్రబాబు ఎంత నష్టపరిహారం ఇచ్చారని మంత్రి ప్రశ్నించారు. 

టీడీపీ అలసత్వం వల్ల గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌కు  నష్టం జరిగిందని రాంబాబు తెలిపారు. ప్రతి సంక్షోభాన్ని రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. మిచౌంగ్ తుఫాన్ కొన్ని జిల్లాలను అతలాకుతలం చేసిందని రాంబాబు తెలిపారు. డ్యామ్ సేఫ్టీ కమిటీ నివేదికల్ని అప్పట్లో టీడీపీ పట్టించుకోలేదని మంత్రి మండిపడ్డారు. టెండర్లు ఖరారయ్యాక, పని ప్రారంభానికి ముందే తుఫాన్ వచ్చిందని అంబటి స్పష్టం చేశారు. చంద్రబాబులా షో చేయడం జగన్‌కు అలవాటు లేదని మంత్రి చురకలంటించారు. 

Latest Videos

అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు పెట్టి బ్యూటిఫికేషన్ చేసింది తప్పించి రిపేర్లు చేయలేదని రాంబాబు ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌పై చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అంబటి పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్‌లు కట్టింది వైఎస్సారేనని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని రాంబాబు వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ఇక్కడికి టూరిస్టుల్లా వచ్చి మాట్లాడి హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నారని మంత్రి చురకలంటించారు. 

తెలంగాణలో టీడీపీ జెండాలు ఎగిరిన చోట కాంగ్రెస్ గెలవలేదని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. జనసేనకు నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదన్నారు. చంద్రబాబు.. జనసేనకు ముష్టి వేసినట్లుగా సీట్లు వేస్తారని ఆయన ఆరోపించారు. టీడీపీ నుంచి జనసేనలోకి పంపి.. వారినే జనసేన అభ్యర్ధులుగా నిలబెడతారని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. తుఫాను సమయంలో ప్రభుత్వం వేగంగా సహాయక చర్యలు చేపట్టిందని.. చంద్రబాబు వైఖరి గురించి ప్రజలకు తెలుసనని ఆయన పేర్కొన్నారు. 

చంద్రబాబు మాటలకు ఎల్లో మీడియా వంత పాడుతోందన్నారు. తప్పుడు కథనాలతో ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని.. తద్వారా రామోజీరావు శునకానందం పొందుతున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రైతులను చంద్రబాబు ఏరోజూ పట్టించుకోలేదని, జగన్ రైతన్నకు అండగా నిలిచాడని మంత్రి తెలిపారు. తుఫాను బాధిత గ్రామాల్లో వుంటే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని రాంబాబు వెల్లడించారు. గత ప్రభుత్వం తప్పిదాలను కూడా జగన్‌కు ఆపాదిస్తున్నారని, సాగునీటి ప్రాజెక్ట్‌లపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి చెప్పారు. 

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో చంద్రబాబు ఎన్నో తప్పిదాలు చేశారని రాంబాబు ఆరోపించారు. తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేశారని.. చంద్రబాబు, పవన్‌లకు ఏపీలో సొంతిల్లు కూడా లేదని మంత్రి దుయ్యబట్టారు. తెలంగాణలో చంద్రబాబు గోడ మీద పిల్లిలా వ్యవహరించారని అంబటి రాంబాబు ఆరోపించారు. పవన్‌కు 7 చోట్ల  డిపాజిట్లు కూడా రాలేదని, మీరంతా ఏపీలో నానా హడావుడి చేస్తున్నారని రాంబాబు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆలస్యంగానైనా వాస్తవాలను గ్రహించారని, తమ సభలకు జనం వస్తున్నారు కానీ ఓట్లు వేయడం లేదని పవన్ తెలుసుకున్నారని రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ ఇంకా కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు. 
 

click me!