ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ నుంచి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. తమకు రాయలసీమ ఎత్తిపోతల నుంచి నీటిని లిఫ్ట్ చేయడం మినహా మరే ప్రత్యామ్నాయం లేదని ఏపీ తన వాదనలు వినిపించింది.
రాయలసీమ ప్రాజెక్ట్లకు నీరందాలంటే 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. రాయలసీమ లిఫ్ట్ ద్వారా కొత్తగా నీటి నీల్వ సామర్ధ్యం, కొత్తగా ఆయకట్టు రావడం లేదు.
తెలంగాణ ప్రభుత్వం కావాలనే యాగీ చేస్తోందని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు 600 టీఎంసీలు అవసరమని గతంలో కేసీఆరే అన్నారని ఏపీ సర్కార్ గుర్తుచేసింది.
అంతకుముందు నదీ జలాల విషయంలో ఏపీ సర్కార్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల నిర్మాణం ఏపీ ప్రభుత్వం ఆపాలని కేసీఆర్ కోరారు.
ఆపకపోతే ఆలంపూర్-పెద్దమరూర్ దగ్గర బ్యారేజ్ నిర్మించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకుంటామని సీఎం పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చాలా అన్యాయం చేశారన్న కేసీఆర్... కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్ట్లను ఆపాలని పలుసార్లు కోరామని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని.. అయినప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ కొనసాగించడం సరికాదని సీఎం విమర్శించారు.
తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే ఊరుకోమన్నారు. నదీ జలాల పంపిణీలో తమకు జరిగిన అన్యాయ ఫలితమే తెలంగాణ ఉద్యమమని కేసీఆర్ గుర్తుచేశారు. నదీ జలాల కేటాయింపు కోసం ట్రిబ్యునల్ వేయాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు.