కోర్ట్ దగ్గర నా హత్యకు కుట్ర.. లోకేష్‌దే బాధ్యత : పోసాని సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 22, 2023, 3:55 PM IST
Highlights

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మండిపడ్డారు వైసీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి. లోకేష్‌పై పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్లు జైల్లో వుంటారని పోసాని హెచ్చరించారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మండిపడ్డారు వైసీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను హత్య చేయడానికి లోకేష్ కుట్ర పన్నుతున్నారని.. కోర్ట్‌కు హాజరయ్యేటప్పుడు తనను చంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.  లోకేష్ తనపై రూ.4 కోట్లు పరువు నష్టం దావా వేశారని ఫైర్ అయ్యారు.

లోకేశ్ ఎవరిపై విమర్శలు చేయలేదా అని పోసాని ప్రశ్నించారు. లోకేష్‌పై పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్లు జైల్లో వుంటారని పోసాని హెచ్చరించారు. సీఎంపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన లోకేష్‌పై పరువు నష్టం దావా వేయకూడదా అని పోసాని ప్రశ్నించారు. నాపై పాత కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కృష్ణమురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest Videos

హెరిటేజ్ అంటే చంద్రబాబు గుర్తుకొస్తారని.. మరి హెరిటేజ్ ఆస్తులు లోకేశ్‌కు చెందవా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టడంతో తనపై కక్షకట్టారని.. పుంగనూరులో పోలీసులపై కూడా హత్యాప్రయత్నం చేశారని పోసాని ఆరోపించారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్ధుడు చంద్రబాబన్నారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు వున్నా జైలుకు వెళ్లలేదని.. కొంతమందికి కులం పిచ్చి ఎక్కించి తనను తిట్టిస్తున్నారని పోసాని ఫైర్ అయ్యారు. 

కులాభిమానం వుండొచ్చు కానీ.. దురాభిమానం వుండకూడదన్నారు. గెలిచింది ఎవరైనా ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా అనేది చూడాలని పోసాని కృష్ణమురళీ అన్నారు. రైతుల కష్టాలను తీర్చడానికి వైఎస్సార్ రూ.11 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశారని ప్రశంసించారు. అమరావతిలో 5 శాతం భూములు పేదలకు ఇవ్వాలని చట్టంలో వుందని.. ఆ చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారని పోసాని ఆరోపించారు. 

కులాలకు అతీతంగా వైఎస్సార్ రుణమాఫీ చేశారని.. అప్పుడు తమకు ఈ రుణమాఫీ వద్దని ఈ రైతులు చెప్పారా అని పోసాని ప్రశ్నించారు. పెదకాకానిలో తనకు కొన్ని ఇళ్ల స్థలాలు మాత్రమే వున్నాయని.. తన కష్టార్జితంతోనే ఆ భూములు కొన్నానని ఆయన తెలిపారు. అవసరమైతే నా భూములన్నీ పేదలకు ఉచితంగా ఇచ్చేస్తానని.. పేదల భూములపై వేసిన కేసులు వెనక్కి తీసుకోవాలని పోసాని సవాల్ విసిరారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. తన జీవితాంతం వైఎస్ జగన్ వెంటే వుంటానని కృష్ణమురళీ అన్నారు. 

కంతేరులో భూమి కొన్నాడని అనడం ఆయనకు పరువు నష్టం అయ్యిందట అంటూ పోసాని విమర్శించారు. హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్నది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. లోకేశ్ తల్లి, భార్య ఆస్తులు ఆయనవి కాదా అని నిలదీశారు. లోకేష్ పీఏ చైతన్య తనకు ఫోన్ చేసి టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించాడని పోసాని కృష్ణ మురళీ చెప్పారు. జగన్ వ్యక్తిత్వం నచ్చే ఆయన్ని అభిమానిస్తున్నానని పోసాని తెలిపారు. తాను కూడా కేసు పెడతానని.. నిజం కావాలా, సాక్ష్యం కావాలా అని ప్రశ్నించారు. 

click me!