సుప్రీం, హైకోర్టులపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Aug 17, 2020, 3:44 PM IST
Highlights

సుప్రీం, హైకోర్టులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం, హైకోర్టులకు చెప్పిన పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేయవని నారాయణస్వామి అన్నారు.

చిత్తూరు: సుప్రీం, హైకోర్టులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో ఆయన సోమవారంనాడు ఆ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెప్పి రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలు తయారు చేయవని ఆయన అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని తాము మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని ఆయన అన్నారు. 

ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వకుండా కోర్టులు స్టే ఇవ్వడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇళ్ల పట్టాల కేసులను కోర్టులు త్వరగా పరిష్కరించాలని ఆయన అన్నారు. ఉన్నవాళ్లు భూకబ్జాలు చేస్తారు, పేదవాళ్లు చేయరని ఆయన అన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు తపన అని ఆయన అన్నారు.  

ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్-5 ఉత్తర్వుల విషయంలో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్-5 ఉత్తర్వులు చేసింది. 

దానిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పై విచారణ జరుపుతున్న హైకోర్టు విచారణ పూర్తయ్యేంత వరకు ఆ ఉత్తర్వులను సస్పెన్షన్ పెట్టింది. దానిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే, హైకోర్టు జారీ చేసిన సస్పెన్షన్ ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. 

దానిపై హైకోర్టులో తుది విచారణ జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. రాజధాని భూములను పేదలకు పంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్-5ను జారీ చేసింది. గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్) ఏర్పాటు చేస్తూ ఆ ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వులను హైకోర్టు నాలుగు వారాల పాటు సస్ెపండ్ చేసింది. 

రాజధాని మాస్టర్ ప్రణాళిక ప్రకారం నాలుగు నివాస జోన్లు ఉండేవి. జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆర్-5 జోన్ ను ఏర్పాటు చేసింది. రాజధాని ప్రాంతంలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధుల్లోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతిలో సచివాలయ రాజధానిని మాత్రమే కొనసాగిస్తూ కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నానికి, న్యాయ రాజధానిని కర్నూలుకు తరలించాలని నిర్ణయించింది. ఈ విషయంపై కోర్టులో విచారణ సాగుతోంది.  

click me!