
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన 219వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) సమావేశం సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎల్బీసీ (SLBC) 2022–23 వార్షిక రుణ ప్రణాళికను వెల్లడించింది. 2022-23 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.3,19,480కోట్లు కాగా ఇందులో 51.56శాతం అంటే రూ.1,64,740కోట్లు కేవలం వ్యవసాయ రంగానికి కేటాయించారు. మొత్తంగా ప్రాథమిక రంగానికి 73.76శాతం (రూ. 2,35,680 కోట్లు) కేటాయించనున్నట్లు ఎస్ఎల్బీసీ ప్రకటించింది.
ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ (YS Jagan) మాట్లాడుతూ... కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక ఒడిదుడుకులు దేశ ఆర్థికాభివృద్ధి గమనాన్ని దారుణంగా దెబ్బతీసాయన్నారు. కోవిడ్ ప్రభావం తగ్గుతున్న కొద్దీ తిరిగి ఆర్థిక వ్యవస్థ కోలుకునే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయన్నారు. 2021–22లో దేశ జీడీపీ రూ.237 లక్షల కోట్లు కాగా, ప్రస్తుత ధరల సూచీ ప్రకారం జీడీపీ వృద్ధి అంచనా 19.5శాతంగా ఉందన్నారు సీఎం జగన్.
''అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు, దీని కారణంగా వస్తున్న ఒత్తిళ్లతో ముడిచమురు, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ద్రవ్యోల్బణం 7.79శాతానికి చేరిందని కేంద్ర గణాంకాలశాఖ వివరాలు వెల్లడించింది. గత 8 ఏళ్ల వ్యవధిలో ఇదే అత్యధికం. నిరాశ కలిగించే మరొక విషయం ఏంటంటే... గ్రామీణ ప్రాంతాల్లో కూడా ద్రవ్యోల్బణం అత్యధికంగా 8.38శాతం ఉంది. ఈ కారణాల వల్ల రిజర్వ్ బ్యాంకు మే 6న నగదు నిల్వల నిష్పత్తిని 50 బేసిక్ పాయింట్లు పెంచింది. అలాగే రెపోరేటును 40 బేసిక్ పాయింట్లు పెంచింది. జూన్లో దీన్ని మరో 50 బేసిక్ పాయింట్లకు రిజర్వ్బ్యాంకు పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోంది'' అంటూ జగన్ ఆందోళన వ్యక్తం చేసారు.
Video
''ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6శాతానికి పైబడి ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. దీనివల్ల నగదు నిల్వలు క్రమంగా తగ్గుతాయి. ఈ పరిణామాలన్నీ కూడా దిగువ తరగతి వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తయారీ రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. సరుకులు కొనేవారు లేకపోతే పరిశ్రమలను మూసివేసే పరిస్థితి వస్తుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు విశేష కృషిచేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా అవసరమైన చర్యలను తీసుకోవాలి. తక్కవ వడ్డీలకు విరివిగా రుణాలు ఇవ్వాలి'' అని సీఎం బ్యాంక్ అధికారులకు సూచించారు.
''ప్రభుత్వం తాను చేయాల్సిందంతా చేస్తోంది. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, ప్రత్యక్షంగా నగదు బదిలీచేస్తోంది. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తోంది. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టి, వారిని సాధికారితవైపు నడిపించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటోంది'' అన్నారు.
''ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ 2020–21లో నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించి 133.19శాతం చేరుకోవడం మనసారా అభినందనీయం. కొన్ని రంగాల్లో బ్యాంకుల పనితీరు ప్రశంసనీయం. అగ్రికల్చర్ టర్మ్ లోన్ విషయానికొస్తే వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించుకున్న దానికన్నా 167.27శాతం సాధించారు. అలాగే ప్రాథమికేతర రంగానికి నిర్దేశించుకున్నదానికంటే రెట్టింపు రుణాలు అంటే 208.48శాతం ఇచ్చారు. అయితే మరికొన్ని రంగాల్లో పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఎగుమతులకోసం నిర్దేశించుకున్న దాంట్లో 31.01 శాతం, విద్యారంగానికి సంబంధించి 50.03శాతం, హౌసింగ్కు సంబంధించి 36.11శాతం మాత్రమే రుణాలు ఇచ్చారు. సామాజిక ఆర్థిక ప్రగతిలో విద్య, హౌసింగ్.. ఈరెండుకూడా అత్యంత కీలకమైనవి. ఈ రంగాలకు సంబంధించి బ్యాంకులు మరింత సానుకూల దృక్పథంతో ముందడుగువేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను'' అని సీఎం జగన్ పేర్కొన్నారు.
''వ్యవసాయరంగానికి ఇచ్చే రుణాలను పరిశీలిస్తే ఖరీఫ్లో షార్ట్ టర్మ్ క్రాప్ ప్రొడక్షన్ రుణాలు 87.40శాతం, అదే ఖరీఫ్లో అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ 59.88శాతం మాత్రమే ఇచ్చారు. కాని వార్షిక రుణ ప్రణాళికను పరిశీలిస్తే మాత్రం లక్ష్యానికి మించి ఇచ్చారు. రబీ సీజన్ గణనీయంగా ఉండడం, ఆ సమయంలో పనితీరు బాగుండడం దీనికి కారణంగా కనిపిస్తోంది. కాకపోతే ఖరీఫ్ సీజన్లో ఎందుకు రుణ పంపిణీ లక్ష్యాలను చేరుకోలేకపోయామన్న విషయంపై బ్యాంకులు దృష్టిపెట్టాలని కోరుతున్నాను. అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యంలో 82.09శాతం, పౌల్ట్రీకి సంబంధించి 60.26శాతం మాత్రమే రుణాలు ఇచ్చారు. ఈ రంగాలకు రుణ పంపిణీలో సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరుతున్నాను'' అన్నారు.
''2021–22లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53శాతమే రుణాలు అందాయి. వీరికి రుణాలు అందించడంపై బ్యాంకర్లు మరింత శ్రద్ధపెట్టాలి. రైతులు, కౌలు రైతులు సాగుచేస్తున్న ప్రతి కమతాన్ని కూడా ఇ–క్రాపింగ్ చేస్తున్నాం. సాగుచేస్తున్న కౌలు రైతుల్ని సులభంగా ఈ డేటా ద్వారా గుర్తించవచ్చు. ఈ డేటాను పరిగణలోకి తీసుకుని వారికి విరివిగా రుణాలు ఇచ్చి, బ్యాంకర్లు అండగా నిలవాలి. ఆర్బీకేలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఇద్దరూ కూడా కౌలు రైతులకు ఈ విషయంలో సహాయకారిగా నిలవాలి'' అని సూచించారు.
''చిరువ్యాపారులకు, సంప్రదాయ హస్తకళాకారులకు జగనన్న తోడు అండగా నిలుస్తోంది. వడ్డీలేకుండా రూ.10వేల చొప్పున రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తోంది. రుణభారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. బ్యాంకులు కూడా ఉత్సాహంగా పనిచేస్తూ దాదాపుగా 14.15లక్షల మందికి జగనన్న తోడు కింద రుణాలు ఇచ్చాయి. ఇదే ధోరణిని కొనసాగించాలని కోరుతున్నాను. తదుపరి విడత రుణాలు జులైలో ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం'' అని సీఎం వెల్లడించారు.
''2021–22లో ఎంఎస్ఎంఈలకు 90.55శాతం రుణాలు ఇచ్చారు. ఈ రంగంలో కూడా లక్ష్యం కంటే తక్కువగా రుణాలు ఇచ్చారు. దీనిపై బ్యాంకులు దృష్టిపెట్టాలని కోరుతున్నాను. రాష్ట్రంలో భారీ ఎత్తున గృహనిర్మాణం జరుగుతోంది. విలువైన భూముల పట్టాలను పేదలకు అందించడం జరిగింది. వీటిపై అప్పులు ఇవ్వడం ద్వారా బ్యాంకులిచ్చే రుణాలకు తగిన భద్రత ఉంది. పేదలకు అండగా నిలవాలని బ్యాంకులకు విజ్ఞప్తిచేస్తున్నాను. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుంది. టిడ్కో ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారులతో బ్యాంకులు టైప్ కావాల్సి ఉంది. ఈ అంశంపై బ్యాంకులు దృష్టిపెట్టాలి'' అని సీఎం సూచించారు.
''వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారు లఖాతాల్లో వేస్తున్న నగదును బ్యాంకులు మినహాయించుకోకూడదు. దీనిపై కేంద్ర ప్రభుత్వమే మార్గదర్శకాలు జారీచేసింది. ఒక ప్రత్యేక ఉద్దేశంతో, ఒక లక్ష్యంకోసం ఈ పథకాలు అమలు చేస్తున్నాం. ఈ అంశాన్ని బ్యాంకులు దృష్టిలో ఉంచుకోవాలి'' అని బ్యాంక్ అధికారులకు సీఎం జగన్ సూచించారు.