వాలంటీర్ల కోసం నెలకు రూ.310 కోట్లా: వైసీపీ సర్కార్‌పై సోము వీర్రాజు ఫైర్

By Siva KodatiFirst Published Mar 21, 2021, 2:25 PM IST
Highlights

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన వాలంటీర్ల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. 

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన వాలంటీర్ల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు.

వాలంటీర్ల కోసం నెలకు రూ.310 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వీర్రాజు తెలిపారు. నవరత్నాల కోసం ఏర్పాటైన వ్యవస్థ ఎన్నికలను నిరోధిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వీర్రాజు హెచ్చరించారు.

తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం రెండంచెల కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఆదినారాయణ రెడ్డిని నియమిస్తున్నట్లు వీర్రాజు తెలిపారు. 

అంతకుముందు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు శనివారం నెల్లూరు జిల్లా గూడురులో మెరుపు ధర్నా నిర్వహించారు. ఇటీవల ముగిసిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. 

ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. అధికార పార్టీ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి సహకారం చేయకపోగా వారిపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.

దీనిని బీజేపీ చూస్తూ ఊరుకోదని సోము వీర్రాజు హెచ్చరించారు. గతేడాది ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో కూడా కిడ్నాప్‌లు, దాడులు చేయడంతో పాటు మహిళా నాయకురాలి చేయి విరగ్గొట్టారని ఆయన ఆరోపించారు.

అధికార పార్టీ దౌర్జన్యాలకు బీజేపీ తప్పక సరైన సమాధానం ఇస్తోందని  వీర్రాజు హెచ్చరించారు. ఈ విషయం  జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు

click me!