
తెలుగుదేశం పార్టీలో చేరికపై మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పష్టతనిచ్చారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ఆనం రామనారాయణ రెడ్డి.. ఈరోజు పలువురు టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఆనం రామనారాయణరెడ్డిని ఆయన నివాసంలో టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితరులు కలిశారు. ఈ సందర్బంగా పలు అంశాలపై నేతలు చర్చలు జరిపారు.
అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే నెల్లూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాబోతుందని చెప్పారు. శుక్రవారం రోజున చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా చెప్పారు. కలిసి నడుస్తామని చెప్పడం జరిగిందని.. ఆయన కూడా సంతోషంగా ఆహ్వానించడం జరిగిందని చెప్పారు.
జిల్లాలో లోకేష్ పాదయాత్ర పూర్తైన తర్వాత అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అధికారికంగా పార్టీలో చేరతామని తెలిపారు. తొలుత జిల్లాలో లోకేష్ పాదయాత్రను విజయవంతం చేసేందుకు అందరం కలిసి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రలు.. నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీలోకి చేరాలని ఆయనకు సోమిరెడ్డి, బీద రవిచంద్రలు ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తోంది.మరికొద్ది రోజుల్లోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఆలోపే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను టీడీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ సాగుతుంది.