కేసీఆర్కు మోడీ భయం, పీవీకి కాంగ్రెస్ అన్యాయం: అమిత్ షా
మోడీకి భయపడే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు.
కరీంనగర్: మోడీకి భయపడే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం నాడు జరిగిన బీజేపీ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికలు డిసెంబర్ లో ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. తన కొడుకు లేదా కూతురును సీఎంను చేసేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని అమిత్ షా ఆరోపించారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ప్రజలపై అదనపు భారాన్ని వేశారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని అమిత్ షా ప్రశ్నించారు. అన్ని రంగాల్లో కేసీఆర్ వైఫల్యం చెందారని చెప్పారు.
దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానని చెప్పిన హమీలను అమలు చేయలేదన్నారు. పేదల కోసం ఇళ్లు కట్టిస్తానని ఇచ్చిన నిధులను కేసీఆర్ పక్కదారి పట్టించారని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ఆ పోస్టులను భర్తీ చేయలేదన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయలేదని అమిత్ షా చెప్పారు. నాలుగేన్నర ఏళ్లలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. మజ్లిస్కు భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదన్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు అమిత్ షా హమీ ఇచ్చారు. రజాకార్లు చేసిన అన్యాయాన్ని ఎవరైనా మర్చిపోతారా అని ఆయన ప్రశ్నించారు.
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం సమంజసమేనా అని ఆయన ప్రశ్నించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల ఓబీసీ, దళితుల రిజర్వేషన్లను నష్టపోనున్నారని చెప్పారు.
బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలసవచ్చిన వారిని తిరిగి పంపేందుకు తాము ప్రయత్నిస్తోంటే... కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిష్టులు ఇతర పార్టీలు వారికి మద్దతుగా నిలుస్తున్నారని ఆయన చెప్పారు.
తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అవుతోందా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ నేతృత్వంలో ఎక్కడ కూడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు.దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడ ఉందో చూడాలంటే దుర్బిణీ పెట్టుకొని చూడాల్సిందేనని ఆయన ఎద్దేవా చేశారు.
బాబు మద్దతుతో కాంగ్రెస్ పార్టీ కూటమి ఏర్పాటు వల్ల కేసీఆర్ కు ప్రత్యామ్నాయం కాగలరా అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే ఓవైసీతో పోరాటం చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.
ఓవైసీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనకు అందరికీ తెలుసునని ఆయన చెప్పారు.
వాజ్ పేయ్ అంతిమయాత్రలో ప్రధాని మోడీ 5 కి.మీ పాదయాత్ర చేసి యాత్ర చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ జిల్లాకు చెందిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు అంత్యక్రియలు ఢిల్లీలో జరపకుండా చేశారని అమిత్ షా గుర్తు చేశారు.
పీవీకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నిలదీయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుష్మాన్ భవ పథకాన్ని కేసీఆర్ తన రాష్ట్రానికి వద్దని తిరస్కరించారని అమిత్ షా చెప్పారు.
యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నారు. 13వ, ఫైనాన్స్ కమిషన్ కింద 16,597 కోట్లు తెలంగాణకు ఇచ్చారని ఆయన చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని 14వ, ఫైనాన్స్ 1లక్ష15లక్షల900 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. దేశాన్ని విభజించే పార్టీల వైపు ఉంటారా... దేశాన్ని నిర్మించే బీజేపీ వైపు ఉంటారా అని ఆయన ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు
హైద్రాబాద్ సభలో కేసీఆర్ను సవాల్ చేసిన అమిత్ షా