సెగలు రేపుతున్న తీస్ హజారీ వివాదం: రోడ్డెక్కిన పోలీసులు, న్యాయం కోసం డిమాండ్
తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్ ఉదంతంతో దేశ రాజధాని ఢిల్లీ మంగళవారం అట్టుడుకింది. ఎన్నడూ లేని రీతిలో పోలీసులు రోడ్లపైకి వచ్చి .. తమకు న్యాయం చేయాల్సిందిగా నిరసనకు దిగారు
తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్ ఉదంతంతో దేశ రాజధాని ఢిల్లీ మంగళవారం అట్టుడుకింది. ఎన్నడూ లేని రీతిలో పోలీసులు రోడ్లపైకి వచ్చి .. తమకు న్యాయం చేయాల్సిందిగా నిరసనకు దిగారు.
విధుల్లోకి రావాల్సిందిగా సీనియర్ అధికారులు చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. అంతేకాకుండా నగర పోలీస్ కమీషనర్ అమూల్య పట్నాయక్ స్వయంగా తమ వద్దకు వచ్చి మాట్లాడాలంటూ పట్టుబట్టారు.
Also Read:పోలీసు వాహనాలకు నిప్పు, లాయర్లపై పోలీసుల కాల్పులు..
తీస్ హజారీ కోర్టు ఆవరణలో జరిగిన ఘర్షణపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఢిల్లీ హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. దీనిపై ఆదివారం విచారణ జరిపిన న్యాయస్థానం.. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్పీ గార్గ్ న్యాయ విచారణ చేస్తారని తెలిపింది.
విచారణ జరిగే సమయంలో స్పెషల్ కమీషనర్ సంజయ్ సింగ్, అడిషనల్ డీసీపీ హరీందర్ సింగ్లను బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో న్యాయవాదులపై ఎలాంటి నిర్బందపు చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది.
కాగా ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశామని.. మరొకరిని బదిలీ చేసినట్లు పోలీసు వర్గాలు న్యాయస్థానానికి తెలిపాయి.
కాగా ఈ నెల 2న తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్లో ఘర్షణల నేపథ్యంలో దిగువ కోర్టుల లాయర్లు ఢిల్లీలో సోమవారం నిరసనలకు దిగడం.. ఆ నిరసనల సమయంలో కొందరు లాయర్లు ఢిల్లీ పోలీస్ సిబ్బందిపై దాడి జరిపినట్లు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో రావడం సంచలనం కలిగించింది.
ఈ ఘటనలో పోలీసు సిబ్బంది సహా సుమారు 30 మంది గాయపడగా.. 20 వాహనాలు ధ్వంసమయ్యాయి. పార్కింగ్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాల ఘర్షణల నేపథ్యంలో తీస్ హజారీ, కార్కర్డూమ్ జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి.