ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్
విశేష వార్తలు
- భక్తులతో కిటకిటలాడుతున్న విజయవాడ కనకదుర్గ ఆలయం
- సన్నీ లియోన్ కండోమ్ యాడ్ పై వివాదం
- ఎంపి కవిత ను కలిసిన జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీలు
- డిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కమల్ హాసన్ భేటీ
- తెలంగాణ లో గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్
- సంచార పశు వైద్యశాల వాహనాన్ని ప్రారంభించిన మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి
దసరా లోపు ఉపాధి కూలీల బకాయి డబ్బులు చెల్లింపు
దసరా లోపు ఉపాధి కూలీలకు ఒక్క రూపాయి బకాయి లేకుండా కూలీ డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఢిల్లీలోని కృషి భవన్ లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జీత్ సిన్హాతో మంత్రి గురువారం బేటీ అయ్యారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ... మహాత్మ గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్రాంట్ ఫథకంలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన 250 కోట్ల బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జీత్ సిన్హా ను కోరినట్లు మంత్రి తెలిపారు.దీనిపై వెంటనే స్పందించిన అమర్జీత్ సిన్హా బకాయి నిధులను రాష్ట్రానికి విడుదల చేస్తున్నట్లు చెప్పారన్నారు.
ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కు ప్రతిష్టాత్మక అవార్డు
తెలంగాణ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది.కేంద్ర ప్రభుత్వ క్వాలిటీ కౌన్సిల్ అఫ్ ఇండియా అందించే డీఎల్ షా నేషనల్ క్వాలిటీ గోల్డ్ అవార్డ్ కు ఎంపికైంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రూపొందించిన జీపిఎస్ ఆధారిత మొబైల్ యాప్ కు ఈ అవార్డు లభించింది.
ఈ నెల 22న ఢిల్లీ లో జరిగనున్న 12వ నేషనల్ క్వాలిటీ సమావేశంలో లో అవార్డు ట్రస్ట్ సీఈఓ డాక్టర్ కె మనోహర్ అందుకోనున్నారు.
కల్తీ టొమాటో సాస్ కంపెనీపై పోలీసుల దాడి
హైదరాబాద్ : మేడిపల్లి ప్రాంతంలో అక్రమంగా తయారుచేస్తున్న కల్తీ టొమాటో సాస్ తయారీ సంస్థపై రాచకొండ పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మా గాయత్రి సంస్థ అక్రమంగా ఆహారపదార్థాలను తయారుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కంపెనీ యజమాని స్వామినాథ్ సింగ్ తో పాటు భగవాన్ సింగ్ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దుర్గగుడికి సందర్శకుల తాకిడి
నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ ఆమ్మవారిని సందర్శించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యకుమారి ఆలయ విశేషాలను వెల్లడించారు.
గురువారం సాయంత్రం వరుకు 36420 భక్తులు అమ్మవారిని సందర్శించుకున్నారు.
రు. 300 /- టికెట్స్ ద్వారా రు 60,000 ఆదాయం
రు. 100 /- టికెట్స్ ద్వారా రు.22000 ఆదాయం
లడ్డూ ద్వారారు. 41000 ఆదాయం
పులిహార ద్వారా రు 25000 ఆదాయం వచ్చింది..
8000 అన్నదానంలో భక్తులు పాల్గొన్నారు..
1000 కేశఖండన శాల టికెట్స్ అమ్ముడయ్యాయి..
విఐపిలు ఎవరైనా టికెట్ తీసుకోవాల్సిందే.....
వివాదంలో పోర్న్ స్టార్ సన్ని లియోనీ యాడ్
బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీ లియోనీ నటించిన ఓ కంపెనీకి చెందిన కండోమ్ యాడ్ వివాదాస్పదంగా మారింది. దసరా ఉత్సవాల సందర్భంగా నవరాత్రి థీమ్ తో గుజరాత్లో సన్నీ ఫోటోతో ఏర్పాటుచేసిన ఈ కండోమ్ యాడ్ హోర్డింగ్ మీద కొన్ని హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.
'ప్లే బట్ విత్ లవ్, దిస్ నవరాత్రి' అంటూ ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్ మీద హిందూ యువ వాహిని నిరసనకు దిగింది. ఇది కచ్చితంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని ఈ గ్రూప్ నేత నరేంద్ర చౌదరి అన్నారు. ఈ హోర్డింగులను వెంటనే తొలగించకపోతే తమ నిరసనలను తీవ్రం చేస్తామని హెచ్చరించారు.ఈ యాడ్ హోర్డింగుల మీద 'ది కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు లేఖ రాశారు. వెంటనే కలుగజేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎంపి కవిత ను కలిసిన జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీలు
సింగరేణిలో పనిచేస్తున్న జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీల ప్రతినిధులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం( టిబిజికెఎస్) గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ను కలిశారు.
గురువారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలిసిన జీఎంఇటి ట్రైనీ లు తమ సమస్యలను కవితకు వివరించారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 811 జీఎంఇటి ట్రైనీ పోస్టుల భర్తీ లో మానవతా దృక్పథంతో వయస్సు నిబంధనలు సడలించి అవకాశం కల్పించేలా ప్రభుత్వాన్ని ఒప్పించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రేడ్ -సి కేడర్ లో జాయిన్ అయిన జీఎంఇటి ట్రైనీలకు గ్రేడ్- బి ఓవర్ మెన్ లుగా ప్రమోట్ అయ్యేందుకు 5 ఏళ్లు సర్వీస్ తప్పని సరి అని, ఈ నిబంధనను సడలించి 2 ఏళ్ల కు తగ్గించేలా చూడాలని కోరారు.
అలాగే డిజిఎంఎస్ ధన్ బాద్ నిర్వహించే గ్యాస్ టెస్టింగ్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యేందుకు 20 ఏళ్లు వయస్సు నిబంధన వల్ల తక్కువ వయస్సు కలిగిన ట్రైనీలు ఆ పరీక్ష కు హాజరయ్యే అవకాశం కోల్పోతారని , ఈ నిబంధనను సడలింప చేయాలని కోరారు.
డిల్లీ సీఎం కేజ్రీవాల్ - కమల్ హాసన్ భేటీ
డిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్ తమిళ హీరో కమల్ హాసన్ తో చెన్నైలో భేటీ అయ్యారు. కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశ వార్తల నేపద్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందేనని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కమల్ హాసన్ తెలిపారు.
ఈ భేటీ తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ తాను కమల్ కు పెద్ద అభిమానినని అన్నారు. తమ ఇద్దరి లక్ష్యాలు ఒక్కటేనని, అందువల్ల కమల్ ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా తాము పనిచేయనున్నట్లు తెలిపారు
హైదరాబాద్ లో భారత్ యాత్ర
దేశం లో జరుగుతున్న చిన్నపిల్లల అక్రమ రవాణా, లైంగిక దాడులను అరికట్టడానికి కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ యాత్ర హైదరాబాద్ చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా మొజంజాహి మార్కెట్ క్రాస్ రోడ్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకూ 1కే ర్యాలీ ని నిర్వహించారు. ఈ ర్యాలీ తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ సభ్యులతో పాటు పదివేల మంది చిన్నారులు పాల్గొన్నారు.
గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్
తెలంగాణ లో గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో గ్రూప్ 1 ఫలితాల ఆపాలంటూ ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులను నిలిపివేస్తూ, తాజాగా ఫలితాలు ప్రకటించాలని తెలంగాణ పబ్లిక్ కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. దీంతో గతంలో నిర్వహించిన 128 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. త్వరలోనే ఫలితాలను విడుదల చేయడానికి ప్రయత్నిస్తామని టీఎస్ పిఎస్సి అధికారులు తెలిపారు.
సంచార పశు వైద్యశాల వాహనాన్ని ప్రారంభించిన మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి (వీడియో)
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సంచార పశు వైద్యశాల వాహనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల వైద్యం కోసం ఈ సంచార వాహనాన్ని ప్రారంభించినట్లు, పాడి పశువులకు ఎలాంటి ప్రమాదం జరిగినా 1962 టోల్ ప్రీ నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. పోన్ చేసిన అరగంటలోపు సంచార వాహనం చేరుకుని పశువులకు చికిత్స అందిస్తుందని తెలిపారు.
ఉమ్మడి హైకోర్టులో జడ్జీల ప్రమాణస్వీకారోత్సవం
హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఆరుగురు న్యాయమూర్తులు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. పొట్లపల్లి కేశవరావు, తుడిపినూరి అమర్నాథ్గౌడ్, అభినంద్కుమార్ షావిలి, డీవీఎస్ఎస్ సోమయాజులు, కొంగర విజయలక్ష్మి, మంతోజు గంగారావు ల చేత చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారం చేయించారు. హైకోర్టు లోని ప్రాంగణంలో లోని కోర్ట్ హాల్ నెంబర్ 1 లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.