రెవెన్యూలోనూ ‘రిలయన్స్‌ జియో’ టాప్

By sivanagaprasad kodatiFirst Published Nov 26, 2018, 8:10 AM IST
Highlights

సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలోనూ అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్)లోనూ రిలయన్స్ జియో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానంలో ఐడియా- వొడాఫోన్, మూడో స్థానంలో ఎయిర్ టెల్ నిలిచాయి.
 

జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి టెలికాం రంగంలోని సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్‌) విషయంలోనూ రూ. 8,271 కోట్లతో రిలయన్స్‌ జియో మొదటి స్థానంలో నిలిచిందని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) తెలిపింది.

ట్రాయ్‌ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం ఇటీవల విలీనమైన వొడాఫోన్‌-ఐడియా రూ. 7,528 కోట్ల రాబడితో రెండో స్థానంలో ఉన్నాయి. ఇందులో వొడాఫోన్‌ ఏజీఆర్‌ రూ.4,483.89 కోట్లు కాగా, ఐడియాది రూ. 3,743.1 కోట్లు. భారతీ ఎయిర్‌టెల్‌ రూ.6,720 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఏజీఆర్‌ ఆధారంగానే టెలికాం కంపెనీ నుంచి లైసెన్స్‌, ఇతర ఫీజుల్లో ప్రభుత్వ వాటాను నిర్ణయిస్తారు.

మరోపక్క జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థయైన బీఎస్‌ఎన్‌ఎల్‌ మార్కెట్‌ వాటా రూ. 1,284.12 కోట్లుగా తేలింది. గత త్రైమాసికంలో జియో ఏజీఆర్‌ విలువ రూ. 7,125.7 కోట్లు, అయితే వొడాఫోన్‌-ఐడియా కలిసినప్పుడు ఏజీఆర్‌ల విలువ రూ. 8, 226.79 కోట్లు కావటం గమనార్హం. 

స్థూల ఆదాయ రాబడి విషయంలో వొడాఫోన్‌-ఐడియా రూ.13,542 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, భారతీ ఎయిర్‌టెల్ ‌(రూ.11,596 కోట్లు), రిలయన్స్‌ జియో (రూ.10,738కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

దేశంలోని 22 టెలికాం సర్కిళ్లలో 11 చోట్ల జియో ఏజీఆర్‌ మార్కెట్‌ వాటా ఎక్కువగా ఉండగా, ఎయిర్‌టెల్‌ 6, వొడాఫోన్‌-ఐడియా అయిదు సర్కిళ్లలో మెరుగైన వాటాను కలిగి ఉన్నాయిని ట్రాయ్‌ తెలిపింది.

click me!