డేటా మిస్‌యూజ్: ఫేస్‌బుక్‌కు ఇటలీ రూ.80 వేల కోట్ల జరిమానా

By sivanagaprasad kodatiFirst Published Dec 9, 2018, 3:38 PM IST
Highlights

జుకర్ బర్గ్ సారథ్యంలోని ఫేస్‌బుక్ వివాదాల్లో చిక్కుకుంటున్నది. డేటా దుర్వినియోగం చేస్తున్న కేసులో ఇటలీ నియంత్రణ సంస్థ రూ. 80 వేల కోట్ల పై చిలుకు జరిమానా విధించింది. 

కేంబ్రిడ్జ్‌ అనలిటికా కుంభకోణంతో ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ వివాదం నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఇప్పటికే పలు దేశాల్లో జరిమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ఇటలీ కూడా ఈ సంస్థకు భారీ జరిమానా విధించింది.

యూజర్ల అనుమతి లేకుండా వారి వివరాలను విక్రయిస్తోందని ఆరోపిస్తూ వినియోగదారుల భద్రత చట్టాలను పరిరక్షించే కాంపిటిషన్‌ అథారిటీ ఏజీసీఎం, ఫేస్‌బుక్‌కు 10 మిలియన్‌ యూరోల(రూ. 80కోట్లకు పైమాటే) జరిమానా విధించింది.

‘ఖాతాలు తెరవడంలో యూజర్లను ఫేస్‌బుక్‌ తప్పుదోవ పట్టిస్తోంది. యూజర్లు ఇచ్చే డేటా వాణిజ్య అవసరాలకు ఎలా వినియోగించుకుంటాం అనే సమాచారాన్ని ఫేస్‌బుక్‌ ఖాతాదారులకు ముందే చెప్పట్లేదు. తమ సేవల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని కూడా సంస్థ స్పష్టంగా పేర్కొనడం లేదు. ఇక యూజర్ల డేటాను వారి అనుమతి లేకుండానే ఇతర కంపెనీలకు విక్రయిస్తోంది’ అని ఏజీసీఎం ఆరోపించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు 10 మిలియన్‌ యూరోలు చెల్లించాలని ఆదేశించింది.

ఇదిలా ఉండగా.. ఫేస్‌బుక్‌ మాత్రం తాము ఖాతాదారుల డేటాను విక్రయించలేదని చెబుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కోట్లాది మంది ఫేస్‌బుక్‌ యూజర్ల డేటా దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి యూజర్ల డేటాను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాదంపై ఫేస్‌బుక్‌ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది.
 

click me!