భారత్‌లోకి నోకియా 110 ఎంట్రీ.. నేటి నుంచే విపణిలో లభ్యం

By narsimha lodeFirst Published Oct 18, 2019, 4:14 PM IST
Highlights

హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ భారత విపణిలోకి 2019లో రూపొందించిన ఫీచర్ ఫోన్ నోకియా 110 విడుదల చేసింది. దీని ధర రూ.1599 మాత్రమే.

న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్‌పై ఫోన్లు విడుదల చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ భారత మార్కెట్లో గురువారం 2019 నోకియా 110 ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌‌లో ఎంపీ 3 ప్లేయర్‌తోపాటు, ఎఫ్ఎం ద్వారా పాటలు వినే అవకాశం ఉందని హెచ్ఎండీ తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన స్నేక్ గేమ్‌ను కూడా ఇందులో జోడించింది. రూ. 1599లకే నోకియా 110(2019) ఫోన్ బ్లాక్, ఓషియన్ బ్లూ, పింక్ రంగుల్లో అందుబాటులో ఉంది. శుక్రవారం నుంచి రిటైల్ స్టోర్ల ద్వారా అందరికీ అందుబాటులోకి రానున్నది.

నోకియా 110 (2019) ఫోన్ 1.77 అంగుళాల క్యూక్యూవీజీఏ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఎస్‌పీఆర్‌డీ 65531ఈ ప్రాసెసర్, 4ఎంబీ ర్యామ్ విత్ 4 ఎంబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం ఉంటుంది. మినీ సిమ్ డ్యూయల్ సిమ్ స్లాట్స్, మైక్రో ఎస్డీకార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది.

ఇక 800 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, 18.5 రోజుల స్టాండ్‌బై టైం, 14 గంటల టాక్ టైం, 27 గంటలపాటు ఏకధాటిగా పాటలు వినే అవకాశం ఈ ఫోన్‌లో ఉంటుంది. ఎల్‌ఈడీ టార్చ్‌లైట్, వెనకవైపు కెమెరా ఉన్న ఈ ఫోన్‌లో స్నేక్ గేమ్, నింజా అప్, ఎయిర్ స్ట్రైక్, పుట్‌బాల్ కప్, డూడుల్ జంప్ వంటి గేమ్స్‌ను ఇన్‌స్టాల్ చేశారు.

click me!