న్యూజిలాండ్‌లో కాల్పులు: ఇద్దరు తెలంగాణా వాసుల దుర్మరణం

By Siva KodatiFirst Published Mar 17, 2019, 10:03 AM IST
Highlights

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఓ మసీదులో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు తెలంగాఠణ వాసులు దుర్మరణం పాలయ్యారు. 

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఓ మసీదులో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు తెలంగాఠణ వాసులు దుర్మరణం పాలయ్యారు. దుండగుడి కాల్పుల తర్వాత కనిపించకుండా పోయిన హైదరాబాద్‌కు చెందిన ఫర్హాజ్ అహ్సాన్ చనిపోయాడని న్యూజిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

అలాగే కరీంనగర్‌కు చెందిన ఎండీ ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ కూడా మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరీంనగర్‌ జిల్లా ఉస్మాన్‌పురకు చెందిన ఇమ్రాన్ కుటుంబం అమెరికాలో స్థిరపడింది. ఆయనకు న్యూజిలాండ్‌లో రెస్టారెంట్ ఉంది. ఇమ్రాన్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.

మరోవైపు దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ అంబర్‌పేటకు చెందిన అహ్మద్ ఇక్బాల్ జహంగీర్ ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే కాల్పుల సమయంలో మసీదులో ఉన్న నల్గొండ జిల్లాకు చెందిన మహమ్మద్ అబ్ధుల్ అలీమ్ క్షేమంగా గాయపడ్డారు.

కాగా దుండగుడి కాల్పుల్లో మరో నలుగురు భారతీయులు మరణించారు. వీరిలో ముగ్గురు గుజరాతీయులు, ఒక కేరళ మహిళ ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. గుజరాత్‌కే చెందిన తండ్రీకొడుకులు ఆరిఫ్ వోరా, రమీజ్ వోరా అల్‌నూర్ మసీదులో నమాజుకు వెళ్లారు.

కాల్పుల తర్వాత వారు కనిపించకుండా పోయారు. అయితే వారు కూడా మరణించి వుంటారని న్యూజిలాండ్ ప్రభుత్వం భావిస్తోంది. దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గుజరాత్ వాసి ముసావలీ సులేమాన్ శనివారం మరణించినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

కాగా, ఇంతటి ఘోర విషాదానికి కారణమైన నిందితుడు బ్రెంటన్ టరెంట్‌ను పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచారు. అతడు బెయిల్‌కు దరఖాస్తు చేయకపోవడంతో.. ఏప్రిల్ 5 వరకు రిమాండ్ విధించారు.

నిందితుడిపై గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ తెలిపారు. 2017 నవంబర్‌లో బ్రెంటన్ గన్ లైసెన్స్ పొందాడని, అప్పటి నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం ప్రారంభించాడని వివరించారు.

దాడికి కొన్ని నెలల ముదు సెమీ ఆటోమేటెడ్ ఆయుధాలు, మరో రెండు తుపాకులను కొనుగోలు చేసినట్లు ఆమె వెల్లడించారు. మరోవైపు నిందితుడు బ్రెంటన్ టరెంట్ ‘‘ ది గ్రేట్ రీప్లేస్‌మెంట్’’ పేరుతో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన 74 పేజీల మేనిఫెస్టోలో దిగ్బ్రాంతికర వాస్తవాలు బయటకొస్తున్నాయి.

ఐరోపా దేశాలకు వలసలు పెరిగిపోవడం వల్లే తాను దాడి చేస్తున్నట్లు అందులో పేర్కొన్నాడు. ముఖ్యంగా భారత్, చైనా, టర్కీ నుంచి ఆక్రమణదారులు విపరీతంగా పెరిగిపోయారని, ఐరోపాకు ఈ మూడు దేశాలే ప్రధాన శత్రువులని వివరించాడు. వీరందరినీ ఏరివేయాలని టరెంట్ పిలుపునిచ్చాడు. 

click me!