ప్రజాకూటమి కోసం ఒక్కటవుతున్న ఎన్నారైలు.. లండన్‌లో సమావేశం

By sivanagaprasad kodatiFirst Published Nov 4, 2018, 5:24 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ప్రజాకూటమిగా ఏర్పాటు కావడంతో... వివిధ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలు కూడా ఈ కూటమికి మద్ధతు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా లండన్‌‌లో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ శాఖలు కూడా ఒక్కటయ్యాయి.

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ప్రజాకూటమిగా ఏర్పాటు కావడంతో... వివిధ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలు కూడా ఈ కూటమికి మద్ధతు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా లండన్‌‌లో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ శాఖలు కూడా ఒక్కటయ్యాయి.

ఈ క్రమంలో లండన్ కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి ఎన్నారై శాఖలు ఈరోజు సమావేశమయ్యాయి. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో 30 రోజులకు గాను కార్యాచరణ గురించి.. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే ఎన్నారైలతో గల్ఫ్ భరోసా యాత్ర, కరపత్ర ప్రచారం, యువత, విద్యార్థులతో సమావేశాలు, బహిరంగసభ్యల్లో ఎన్నారైల తరపున ప్రచారం, సోషల్ మీడియాలో ప్రచారం, లండన్‌లో భారీ బహిరంగసభ తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.. టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్, టీజేఎస్‌ల పొత్తుపై ఎలాంటి సందేహం లేదని.. దారులు వేరైనా గమ్యం ఒక్కటేనని.. నియంతృత్వ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడి.. దాని స్థానంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చేయాలన్నారు.. అప్పుడే అమరవీరుల ఆత్మకు శాంతి కలుగుతుందని వేణుగోపాల్ అన్నారు..

టీడీపీ యూకే సెల్ అధ్యక్షులు జై కుమార్ గుంటుపల్లి మాట్లాడుతూ.. రాబోయేది మహాకూటమి ప్రభుత్వమేనని.. కేసీఆర్‌ పాలించే హక్కు కోల్పోయారని.. ప్రధాని చేతిలో కీలుబొమ్మలా ఆడుతున్నారని విమర్శించారు. ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే.. మధ్యలోనే వదిలేసి ప్రజలపై భారం మోపారన్నారు. ఒక్క డీఎస్సీ కూడా వేయకుండా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనత కేసీఆర్‌దేనని జైకుమార్ విమర్శించారు.

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ఆశయాలను, ఆశలను వొమ్ము చేశారన్నారు టీజేఎస్ యూకే అధ్యక్షులు రంగు వెంకట్. 1200 మంది అమరవీరులను 350 మందిగా చూపడం హేయమని అన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోకుండా.. ఉద్యమ వ్యతిరేకులతో కేసీఆర్ దర్బార్ నింపారని ఆయన దుయ్యబట్టారు.

2014 ఎన్నికల హామీల్లో 90 శాతం చేయకుండా మాట తప్పి మాయమాటలతో మోసం చేస్తున్న కేసీఆర్‌కి పాలించే హక్కు లేదన్నారు.  ఈ కార్యక్రమంలో  రంగుల సుధాకర్ గౌడ్, వేణు పోపూరి, నరేశ్ మలినేని, శ్రీ కిరణ్ పరుచూరి, నవీన్ జవ్వాది, కూర రవి, ఆకుల వెంకట స్వామి గౌడ్ పాల్గొన్నారు.
 

click me!