డిసెంబర్ కల్లా 5జీ సేవలపై ట్రయల్స్

By Siva KodatiFirst Published Mar 24, 2019, 12:40 PM IST
Highlights

దేశీయంగా వచ్చే ఏడాది మూడో త్రైమాసికం నాటికి 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం యోచిస్తున్నది. 

దేశంలో అత్యాధునిక 5జీ టెలికం సేవలపై ఈ ఏడాది చివరి నుంచి ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించిందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ దిశగా వేగంగా పని చేస్తోంది.

దేశంలో ప్రయోగాత్మకంగా 5జీ సేవలను ఈ ఏడాది చివరి నుంచి గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ అందుబాటులోకి తెస్తామని కమిటీ చైర్మెన్‌ అభయ్ కరంధీకర్‌ అన్నారు.

వచ్చే ఏడాది రెండవ, మూడవ త్రైమాసికంలో ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే దిశగా ముందుకు సాగుతున్నట్టు 5జీపై కేంద్రం నియమించిన ప్యానెల్ అధిపతి అభయ్ కరందీకర్ వివరించారు.

5జీ సేవల ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చేందుకు గాను 90 రోజులకు మించి పవన తరంగాలను కేటాయించేందుకు టెలికం శాఖ ఇప్పటి వరకు విముఖతను వ్యక్తం చేస్తోంది.

ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని.. 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పూర్తిగా పరీక్షించడానికి టెలికం ప్రొవైడర్లకు కనీసం ఏడాది కాలం పవన తరంగాలను కేటాయించాల్సి ఉంటుందని 5జీపై కేంద్రం నియమించిన ప్యానెల్ అధిపతి అభయ్ కరందీకర్  అన్నారు.

ఈ విషయమై ప్రభుత్వ నిబంధనలకు సడలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. దేశంలో 5జీ సేవలను అం దుబాటులోకి తేవాలని యోచిస్తున్న ప్రభుత్వం ఫిబ్రవరి 25న ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రొఫెసర్‌ కరంధీకర్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే.

ఈ కమిటీలో విద్యావేత్తలు, పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వం నుంచి అధికారులు సభ్యులుగా ఉన్నారు. ప్రయోగాత్మకంగా 5జీ సేవలను తేవడం, 5జీ సేవలను చేపట్టేందుక లైసెన్సింగ్‌ విధానం, అందుకు అవసరమైన ధరలతో పాటు వివిధ టెక్ని కల్‌ అంశాలపై సూచనల నిమిత్తం సర్కార్ దీనిని ఏర్పాటు చేసింది.
 

click me!