గోపగాని రవీందర్ తెలుగు కవిత: శ్రమఫలం

By telugu teamFirst Published Oct 12, 2020, 3:44 PM IST
Highlights

తెలుగు సాహిత్యంలో కవిత్వం విశిష్టమైంది. ప్రముఖ కవి గోపగాని రవీందర్ శ్రమఫలం అనే కవితను రాశారు. దాన్ని మీకు అందిస్తున్నాం, చదవండి.

నరాల సత్తువతో 
నేలతల్లిని నమ్ముకున్న
చెమట చుక్కలు వాళ్ళు
బతుకులతో వ్యాపారం నీళ్ళు చెయ్యలేని
నిజమైన మానవతా మూర్తులు వాళ్ళు

సుక్కల్లాంటి ఇంద్రభవనాల్లోకి
అమృతం వంటి ఆహారాన్ని ప్రసాదించి
ఈసడింపు మాటలను దులుపుకునేది వాళ్ళు

సేద్యం చేయకపోతే  ఆకలి తీరదని తెలిసిన
ప్రతి గింజను రూపాయల లెక్కన చూడకనే
ప్రాణం నిలబడుతుందని కోరుకునేది వాళ్ళు

దేనినైన డబ్బుతో విలువ కట్టే 
అత్యాధునిక విలాసవంతమైన  నగర వాసికి
మానవతా నిలయానికి నిదర్శనమై
దుమ్ముకొట్టుకపోయిన పల్లె నివాసికి
మధ్యనున్న వైవిధ్యమైన అసమానత్వమైన బంధం
రైలు పట్టాల్లా కలువవేమో అన్నట్లుగుంటాయి
శ్రమించేవి పల్లెలు, శ్రమఫలం ఆరగించేవి నగరాలు..!

click me!