ఆర్టీసీ విలీనం మా మేనిఫెస్టోలో లేదు: గంగుల కమలాకర్

By narsimha lodeFirst Published Oct 13, 2019, 11:41 AM IST
Highlights

ఆర్టీసీ కార్మికులను విపక్షాలు తమ స్వార్థానికి ఉపయోగించుకొంటున్నాయని ప్రభుత్వం విమర్శలు చేసింది. తమకు అనుకూలంగా ఆర్టీసీ కార్మికులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. 


కరీంనగర్: ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని తాము ఏనాడూ చెప్పలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని కూడ  తాము మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.

ఆదివారం నాడు మంత్రి గంగుల కమలాకర్  కరీంనగర్ లో  మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ఆర్టీసీ కార్మికులను ఉపయోగించుకొంటున్నారని ఆయన విమర్శించారుద. ఆర్టీసీ కార్మికులు 26 డిమాండ్లను వదిలేసి ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను మాత్రమే ముందుకు తీసుకొచ్చారన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ఆయన ప్రశ్నించారు. బిఎస్‌ఎన్ఎల్, రైల్వే, ఎయిరిండియాలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేశారు. 

ఆర్టీసీని కాపాడుకొనేందుకు ముఖ్యమంత్రి  ప్రయత్నం చేస్తోంటే  విపక్షాలు  కార్మికులను రెచ్చగొడుతున్నారని మంత్రి విమర్శించారు. 44 శాతం ఫిట్ మెంట్, 16 శాతం ఐఆర్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనే విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.

ముఖ్యమంత్రిపై అక్కసుతోనే విపక్షాలు కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు పునరాలోచన చేయాలని ఆయన కోరారు. ఎవరు కార్మికుల పక్షాలన ఉన్నారో గుర్తించాలన్నారు.

గతంలో కంటే రవాణా వ్యవస్థ మెరుగైందన్నారు. ప్రజలు సంతోషంగా ఉండడం విపక్షాలకు మింగుడుపడడం లేదన్నారు. ఈ కారణంగానే ఆర్టీసీ కార్మికులను రెచ్చగొడుతున్నారని గంగుల కమలాకర్ ఆరోపించారు. 

సాధ్యం కాని డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తెచ్చి ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందులు పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని  మంత్రి గంగుల కమలాకర్  విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆర్టీసీ కార్మికులను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.


 

click me!