journalists: 2021లో 45 మంది జ‌ర్న‌లిస్టుల హ‌త్య‌.. ప్ర‌మాదంలో పత్రికా స్వేచ్ఛ‌..

By Mahesh RajamoniFirst Published Dec 30, 2021, 10:42 PM IST
Highlights

journalists: ప‌త్రికా స్వేచ్ఛ ప్ర‌మాదంలో ప‌డింద‌నీ, జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని ఇంట‌ర్నేష‌నల్ ప్రెస్ ఇనిస్టిట్యూట్ (ఐపీఐ) నివేదిక పేర్కొంది. 2021లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 45 మంది జ‌ర్న‌లిస్టులు హత్య చేయ‌బ‌డ్డార‌ని త‌న వార్షిక నివేదిక‌లో వెల్ల‌డించింది. 
 

journalists: 2021లో ప్రపంచవ్యాప్తంగా 45 మంది జర్నలిస్టులు హత్యచేయబడ్డారు. ఇంటర్నేషనల్‌ ప్రెస్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐపీఐ) తన వార్షిక ‘డెత్‌ వాచ్‌’ జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం.. 2021లో ప్రపంచవ్యాప్తంగా 45 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అధికంగా మెక్సికోలో 7 మంది జర్నలిస్టులు హత్య చేయబడ్డారు. వరుసగా రెండో ఏడాది అధికంగా జర్నలిస్టు హత్యలు నివేదించబడటంతో ఐపీఐ డెత్‌ వాచ్‌ జాబితాలో మెక్సికో టాప్ లో ఉంది. ఆ తర్వాతి స్థానంలో భారత్‌ (6), ఆఫ్ఘానిస్థాన్‌ (6),  డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (3)లు ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేసిన ఈ నివేదిక.. జర్నలిస్టుల భద్రత రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతున్నదనీ, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి హత్యలు పెరుగ్నుతున్నాయని పేర్కొంది. సాపేక్షంగా అధిక స్థాయి పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశాలలో కూడా జర్నలిస్టుల జీవితాలపై ప్రత్యక్షంగా ప్రభావానికి  గురికావడం ఆందోళనకరమైన విషయమని పేర్కొంది. హత్యకుగురైన 45 మంది జర్నలిస్టులలో 28 మంది వారి పనిలో లక్ష్యంగా చేసుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు జర్నలిస్టులు సంఘర్షణను కవర్‌ చేస్తున్నప్పుడు, ఇద్దరు పౌర అశాంతిని కవర్‌ చేస్తున్నప్పుడు హత్యకు గురయ్యారు.

Also Read: Omicron: ఒమిక్రాన్ దెబ్బకు అమెరికా విలవిల.. ఒక్కరోజే 5 లక్ష‌ల కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

మొత్తం హత్యల్లో 11 ఇంకా విచారణలోనే ఉన్నాయి. అంటే వారు తమ పని కోసం చంపబడ్డారనే అనుమానాలు ఉన్నప్పటికీ, ఖచ్చితంగా చెప్పడానికి తగిన సాక్ష్యాలు ఇంకా లేవు. ఫిలిప్పీన్స్‌లో ఈ ఏడాది హత్యకు గురైన మాజీ రాయిటర్స్‌ జర్నలిస్ట్‌ జెస్‌ మలబాన్‌ను ఈ నివేదిక ఉదాహరణగా పేర్కొంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం జర్నలిస్టులకు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైనదిగా నిరూపించబడిరది. ఇదే ప్రాంతంలో ఉన్న‌ భారత్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలో.. మొత్తం 45 జర్నలిస్టుల హత్యల్లో 12 ఇక్కడే నమోదయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో హత్యలు ఆగ‌స్టులో హింసాత్మకమైన తాలిబాన్‌ ఆఫ్ఘన్‌ స్వాధీనం, మీడియాపై తదుపరి నిర్బంధం కారణంగా ప్రేరేపించబడ్డాయి. ఈ ఆరు హత్యలు నేరుగా పాత్రికేయ వృత్తికి సంబంధించినవిగా పరిగ‌ణించబడుతున్నప్పటికీ, దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కాబూల్‌ విమానాశ్రయంలో బాంబు పేలుడులో మరణించిన మరో ఇద్దరు జర్నలిస్టులను ఈ జాబితాలో చేర్చలేదు. గ‌తేడాది ఈ జాబితాలో టాప్‌లో ఉన్న అమెరికా ఈ ఏడాది పది హత్యలు నమోదయ్యాయి. మెక్సికోలో జరిగిన మొత్తం ఏడు హత్యలు లక్ష్యంగా చేసుకున్నవి. వీటిలో ఎక్కువ భాగం స్థానిక‌ రాజకీయాలు, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన అంశాల నేపథ్యంలో చోటుచేసుకున్నాయి.

Also Read: Amit Shah: క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది.. నిర్లక్ష్యం వహిస్తే.. మహమ్మారి నియంత్రణ కష్టమే..!

జ‌ర్నలిస్టులకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా మెక్సికో నిలిచింది. ఈ హత్యలు పత్రికా స్వేచ్ఛ తక్కువగా ఉన్న దేశాలతో పాటు.. మెరుగైన దేశాల్లోనూ చోటుచేసుకుంటున్నాయి. పత్రికా స్వేచ్ఛలో దారుణంగా ఉన్న మెక్సికో (ర్యాంక్‌ 143), భారతదేశం (142), ఆఫ్ఘనిస్థాన్‌ (122) వంటి దేశాల్లో అధికంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇదిలావుండగా, జర్నలిస్టుల హత్యలకు సంబంధించిన పరిశోధనలు తరచుగా లోపభూయిష్టంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. దీంతో వారి కుటుంబాలకు న్యాయం దక్కడంలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్ప‌టికీ ఇలాంటి ఘ‌ట‌న‌లు చేసుకుంటుండంపై ఆందోళన వ్యక్తం చేస్తూ..  మీడియా ఫ్రీడ‌మ్ ప్ర‌మాదంలోకి జారుకుంటున్న‌ద‌ని ఐపీఐ పేర్కొంది.  

Also Read: Omicron: ఆ మూడు గంటలు మద్యం అమ్మకాలు ఆపండి... హైకోర్టు ఆదేశాలు

click me!