
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద బుధవారంఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రామచంద్రాపురంలోని నారాయణ కాలేజీ విద్యార్ధిని సంధ్య హాస్టల్ బాత్రూమ్లో ఉరేసుకొని మృతి చెందింది.కాలేజీ యాజమాన్యం ఒత్తిడుల కారణంగానే సంధ్య ఆత్మహత్య చేసుకొందని విద్యార్ధి సంఘాలతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే మృతురాలి తండ్రిపై ఓ పోలీస్ కానిస్టేబుల్ అత్యంత పాశవికంగా వ్యవహరించాడు.
ఇప్పటికే కూతురుని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న తండ్రిని బూటుకాలితో తంతూ మరింత బాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఈ ఘటన మరింత వివాదాస్పదంగా మారింది. దీంతో వెంటనే స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు సదరు పోలీస్ కానిస్టేబుల్ ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ పెద్ద కూతురు సంధ్య. ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశ్యంతో ఆమెను నారాయణ కాలేజీలో చేర్పించారు పేరేంట్స్. తనకు ఆరోగ్యం బాగా లేదని సంధ్య రెండు రోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తాను చదవలేకపోతున్నానని ఆమె చెప్పింది. అయితే తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పారు. మరోసారి కూడ ఆమె ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. కానీ ఫలితం లేకపోయింది.
పరీక్షలు దగ్గరపడుతుండడం ఆరోగ్యం సహకరించకపోవడంతో సంధ్య బాత్రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సంధ్య మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకొన్న విద్యార్ధి సంఘాల నేతలు బుధవారం నాడు ఉదయం పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.
విద్యార్థి సంఘాల నేతలు మార్చురీలో ఉన్న సంధ్య మృతదేహన్ని బయలకు తీసుకొచ్చారు. మార్చురీ తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి శవపేటికతో పాటు సంధ్య మృతదేహన్ని ఆసుపత్రి ప్రాంగణం నుండి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
మృతదేహంతో కాలేజీ ముందు ధర్నాకు చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు సంధ్య మృతదేహన్ని తిరిగి మార్చురీలోకి తీసుకెళ్లకుండా విద్యార్ధి సంఘాలు అడ్డుకొన్నారు. మృతదేహం భద్రపర్చిన శవపేటికి ముందు ఓ వ్యక్తి పడుకొని అడ్డుపడ్డాడు. అతడిని ఓ కానిస్టేబుల్ కాలితో తీవ్రంగా తన్నాడు.