హైదరాబాదులో చంద్రబాబుకు షాక్: టీడీపీకి మరో నేత గుడ్ బై

By telugu teamFirst Published Nov 5, 2020, 8:50 AM IST
Highlights

హైదరాబాదులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో దెబ్బ తగిలింది. బేగంపేటకు చెందిన కీలకమైన నాయకుడు టీడీపీకి గుడ్ బై చెప్పి బిజెపిల ో చేరేందుకు సిద్ధపడ్డారు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది. హైదరాబాదులోని ఓ కీలక నేత టీడీపీకి రాంరాం చెప్పనున్నారు. హైదరాబాదులోని బేగంపేటకు చందిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీటీడీపీ) కార్యనిర్వాహక కార్యదర్శి గంగాధర్ గౌడ్ పార్టీని వీడనున్నారు. 

గంగాధర్ గౌడ్ బిజెపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం గంగాధర్ గౌడ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావులతో కలిసి చర్చలు జరిపారు. 

తమ పార్టీలోకి వస్తే తగిన స్థానం కల్పిస్తామని బిజెపి నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 8వ తేదీన హైదరాబాదులోని బేగంపేటలో జరిగే కార్యక్రమంలో ఆయన బిజెపిలో చేరుతారని అంటున్నారు. 

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను చంద్రబాబు తిరిగి నియమించారు. ఆయన స్థానంలో మరో నేతను అధ్యక్షుడిగా నియమించాలనే కొంత మంది నాయకుల విజ్ఞప్తిని చంద్రబాబు పట్టించుకోలేదు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ వ్యూహం ఏమిటో తెలియడం లేదు.

బిజెపి మాత్రం టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడానికి వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే గంగాధర్ గౌడ్ వంటి హైదరాబాదు నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది.

click me!