ఆ రెస్టారెంట్ ఓనర్‌ను స్విగ్గీ డెలివరీ బాయ్ చంపాడా? ఆ వార్తల్లో నిజమెంత?

By telugu teamFirst Published Sep 1, 2021, 8:36 PM IST
Highlights

గ్రేటర్ నోయిడాలో ఓ రెస్టారెంట్ ఓనర్‌ను స్విగ్గీ డెలివరీ బాయ్ కాల్చి చంపాడని వచ్చిన వార్తలను పోలీసులు కొట్టిపారేశారు. రెస్టారెంట్ ఓనర్ సునీల్ అగర్వాల్ హత్యలో డెలివరీ బాయ్ హస్తం నేరుగా లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో భాగంగా ముగ్గురిని అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ: స్విగ్గీ ఆర్డర్ ప్రిపేర్ చేయడంలో ఆలస్యమైందని ఓ డెలివరీ బాయ్ నోయిడాలోని రెస్టారెంట్ ఓనర్‌ను తుపాకీతో కాల్చి చంపారని వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. పోలీసుల వివరాల ప్రకారం జామ్ జామ్ రెస్టారెంట్ ఓనర్ సునీల్ హత్యలో స్విగ్గీ డెలివరీ బాయ్ నేరుగా ప్రమేయం లేదని పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు వికాస్‌గా గుర్తించినట్టు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరిని పట్టుకోవడంలో చిన్నపాటి గన్ ఫైరింగ్ కూడా చోటుచేసుకున్నట్టు వివరించారు. వికాస్ కాలిలోకి బుల్లెట్ చొచ్చుకెళ్లినట్టు చెప్పారు.

గ్రేటర్ నోయిడాలో మిత్ర సొసైటీలోని జామ్ జామ్ ఫుడ్ డెలివరీ రెస్టారెంట్ దగ్గరకు స్విగ్గీ డెలివరీ బాయ్ మంగళవారం అర్ధరాత్రి చేరుకున్నాడు. చికెన్ బిర్యానీ, పూరీ సబ్జీ ఆర్డర్ డెలివరీ కోసం వెయిట్ చేశాడు. రెస్టారెంట్‌లోని నారాయణ్ అనే వర్కర్ చికెన్ బిర్యానీని డెలివరీ బాయ్ చేతిలో పెట్టాడు. పూరీ సబ్జీకి సమయం పడుతుందని, వెయిట్ చేయాలని సూచించాడు. డెలివరీ లేట్ కావడంపై స్విగ్గీ డెలివరీ బాయ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే ప్రిపేర్ చేయాలని వర్కర్ నారాయణ్‌తో గొడవకు దిగాడు.

ఇది గమనించిన రెస్టారెంట్ ఓనర్ సునీల్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరినీ శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్ మరింత మండిపడ్డాడు. అయితే, ఇదే సమయంలో అక్కడ మరో ఇద్దరూ తాగి మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. డెలివరీ బాయ్ గొడవ పడుతుండగానే ఓనర్ సునీల్ అగర్వాల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్టు చెప్పారు. అయితే, స్విగ్గీ డెలివరీ బాయ్ ఈ కాల్పులు జరిపారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తలు అవాస్తవాలని పోలీసులు చెప్పారు.

తలలోకి బుల్లెట్ దిగగానే సునీల్ అగర్వాల్ కిందపడి విలవిల్లాడాడు. వర్కర్ నారాయణ్ సహా ఇతరులు సునీల్‌ను సమీపంలోని యథార్థ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, ఆయన అప్పటికే మరణించాడని వైద్యులు తేల్చారు.

click me!