తన పంథాని మార్చారు వెంకటేష్. ఆయన ఇటీవల `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ చేశారు. నెట్ఫ్లిక్స్ లో ప్రసారమైన ఈ `రానా నాయుడు`పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వెంకటేష్ దారుణంగా ట్రోల్ అయ్యారు.
విక్టరీ వెంకటేష్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్. ఆయనకు ఆడవాళ్ల ఫాలోయింగ్ ఎక్కువ. కెరీర్లో అలాంటి క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేసి మెప్పించారు. అందులోనే ఎక్కువ విజయాలు అందుకున్నారు. యాక్షన్, థ్రిల్లర్ తరహా జోనర్లు ప్రయత్నించినా సక్సెస్ తక్కువ. వెంకటేష్ సినిమా అంటే మంచి కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్లు ఉంటాయని, సరదాగా ఫ్యామిలీతో చూసే సినిమా అవుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది.
కానీ తన పంథాని మార్చారు వెంకటేష్. ఆయన ఇటీవల `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ చేశారు. నెట్ఫ్లిక్స్ లో ప్రసారమైన ఈ `రానా నాయుడు`పై తీవ్ర విమర్శలు వచ్చాయి. బూతులే బూతులు, వల్గారిటీ సన్నివేశాలు, సెక్స్ తప్ప ఇందులో ఏం లేదనేది మేజర్ ఆడియెన్స్ వాదన. అయినా దీన్ని యూత్ బాగానే చూశారు. బోల్డ్ అండ్ హాట్ కంటెంట్ కావడంతో యూత్ దీన్ని చూసింది. కానీ మేజర్గా విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా వెంకటేష్ ట్రోల్స్ కి గురయ్యారు. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో ఇలాంటి బూతు షో చేస్తాడా? అనేది సినీ ప్రముఖులు, అభిమానులు బహిరంగంగానే విమర్శించారు.
దీనిపై ఇటీవల వెంకటేష్ స్పందించి, అదొక ప్రయోగమని, కొత్త పంథాలో ప్రయత్నించామని, కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. అందరి అభిప్రాయాలను గౌరవించాలని, ఇప్పుడు వచ్చిన స్పందనని బట్టి మున్ముందు చేసే షోలో ఆ జాగ్రత్తలు తీసుకుంటామని, సీజన్ 2లో అది లేకుండా చూసుకుంటామని తెలిపారు వెంకీ. అయితే వెంకటేష్ ఇది కాదు, మరోటి ప్లాన్ చేస్తున్నారట. మంచి కామెడీ సినిమా ట్రై చేస్తున్నారట. బూతు ఇమేజ్ ని పోగొట్టి, దాన్నుంచి బయటపడి, మంచి ఎంటర్టైనింగ్ సినిమాతో అలరించాలని చూస్తున్నారట.
అందుకోసం మంచి జాతిరత్నంని పట్టారని సమాచారం. `జాతిరత్నాలు` చిత్ర దర్శకుడితో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మంచి కామెడీ ఎంటర్టైనర్ చేయాలని అనుకుంటున్నారట. అనుదీప్తో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. రెండు మూడు ఐడియాస్ చెప్పారని, మెయిన్గా కథపై వర్క్ జరుగుతుందని, అన్నీ సెట్ అయితే త్వరలోనే ఓ సినిమా ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అనుదీప్తో సినిమాతోపాటు వెబ్ సిరీస్ కూడా చేసే ఆలోచనలో వెంకటేష్ ఉన్నారట. `రానా నాయుడు`తో వచ్చిన బోల్డ్ ఇమేజ్ నుంచి బయటపడాలంటే మంచి కామెడీ సిరీస్ చేయాలనుకుంటున్నారట. తెలుగు, హిందీలో బైలింగ్వల్గా దీన్ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే సినిమా ఆలోచన కూడా ఉందని, ఈ రెండింటిలో ఏది ముందు మెటీరియలైజ్ అవుతుందనేది సస్పెన్స్ గా మారింది.
ప్రస్తుతం వెంకటేష్.. `హిట్` చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో `సైంథవ్` చిత్రంలో నటిస్తున్నారు. పూర్తి యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. `నారప్ప` తర్వాత వెంకీ ట్రై చేస్తున్న యాక్షన్ మూవీ ఇది.