
`కన్నప్ప` సినిమాతో త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న మంచు విష్ణు.. ప్రభాస్ పై ఎమోషనల్ కామెంట్స్ చేశారు. `కన్నప్ప`లో ప్రభాస్ ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆయన పారితోషికం తీసుకోకుండా చేశాడట.
ఈ విషయాన్ని మంచు విష్ణు చాలా సార్లు వెల్లడించారు. గ్లోబల్ స్టార్గా రాణిస్తున్న ప్రభాస్ మా మూవీలో నటించాల్సిన అవసరం లేదని, కానీ నాన్నగారి(మోహన్ బాబు)పై ఉన్న ప్రేమ, అభిమానంతో నటించాడని తెలిపారు. తాజాగా `కన్నప్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది.
ఇందులో మంచు విష్ణు మాట్లాడుతూ, ప్రభాస్తో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు. ప్రభాస్ని మీరంతా నటుడిగా ఇష్టపడతారు, కానీ నేను ఆయన మంచి మనసుకి, వ్యక్తిత్వానికి అభిమానిని అని తెలిపారు.
`స్నేహంలో కృష్ణుడిగా, కర్ణుడిగా రెండు రకాలుంటాయి. నా జీవితంలో కృష్ణుడిగా ప్రభాస్ ఉంటారు. అసలు ఈ చిత్రాన్ని చేయాల్సిన అవసరం ప్రభాస్కి లేదు. నాన్న గారి మీదున్న గౌరవంతోనే ప్రభాస్ ఈ మూవీని చేశారు. స్టార్గా కంటే ప్రభాస్ మానవత్వం ఇంకెంతో గొప్పగా ఉంటుంది.
కొంత డబ్బు, పేరు వచ్చినా అంతా మారిపోతారు. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా అలానే ఒదిగి ఉంటారు. నాకు ప్రభాస్ కృష్ణుడు అయితే, నేను మాత్రం ప్రభాస్కి కర్ణుడిని. ఆయనకు ఎల్లప్పుడూ సపోర్ట్గానే ఉంటాను. ఏం జరిగినా ఆయన వెనకాలే ఉంటాను` అని తెలిపారు మంచు విష్ణు.
విష్ణు మంచు ఇంకా మాట్లాడుతూ, ``కన్నప్ప` విష్ణు సినిమా కాదు. ఇది కన్నప్ప సినిమా. ఎడిటింగ్ టేబుల్ మీద ఈ చిత్రాన్ని చూసినప్పుడు వావ్ అనిపించింది. ‘కన్నప్ప’ అనేది శివానుగ్రహంతోనే జరిగింది.
ఈ ప్రయాణంలో నాకు విజయ్, వినయ్ వెన్నంటే ఉన్నారు. 2017లో స్టీఫెన్ దేవస్సీని కలిశాను. ఈ కన్నప్పని ఎప్పుడు చేస్తాను, ఎలా చేస్తాను అన్నది చెప్పలేను, కానీ ఎప్పుడు చేసినా కూడా మీరే మ్యూజిక్ ఇవ్వాలని అప్పుడే చెప్పాను. స్టీఫెన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు.
శివా శివా శంకరా పాట నాకు ఎప్పుడూ ఛాలెంజింగ్గానే అనిపిస్తుంటుంది. ఆ పాటే నన్ను కాపాడింది. ఈ కథ కోసం పరుచూరి గోపాలకృష్ణ గారు చాలా కష్టపడ్డారు. శివ బాలాజీ చేసిన సాయాన్ని బయటకు చెప్పలేను.
మోహన్లాల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా కోసం వచ్చిన అక్షయ్ కుమార్ గారికి థాంక్స్. శరత్ కుమార్ గారితో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను.
తమిళంలో `కన్నప్ప` చిత్రం పెద్ద స్థాయిలో రిలీజ్ అవుతోందంటే దానికి శరత్ కుమార్ గారే కారణం. న్యూజిలాండ్ షూటింగ్కి కూడా ఆయనే సపోర్ట్ చేశారు. ఈ చిత్రం ప్రారంభం కాక ముందే బ్రహ్మానందం గారు దీవెనలు అందిస్తూ ఉన్నారు.
ఆంటోని ఎడిటింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి కనిపించని హీరో ఆంటోని. నా కెరీర్లో ఉన్న దర్శకులందరిలోనూ ముఖేష్ ది బెస్ట్. కన్నప్ప ప్రయాణం అంత సులభంగా ఏమీ జరగలేదు. ఎన్నో బాధలు పడ్డాం.
ఒకసారి శివరాజ్ కుమార్ని కలిసినప్పుడు అసలు ఈ చిత్రాన్ని ఎందుకు తీస్తున్నావ్ అని అడిగారు. 50 ఏళ్ల తరువాత మళ్లీ మన కన్నప్ప గురించి ఈ తరానికి చెప్పాలని ఆ శివుడే నాతో ఈ మూవీని తీయించారేమో అని శివన్నతో అన్నాను.
నాకు మా నాన్నే దేవుడు. ప్రభు దేవా మాకోసం మూడు పాటల్ని చేశారు. మా చిత్రం జూన్ 27న రాబోతోంది. శివుని ఆశీస్సులు, ఆడియెన్స్ ప్రేమతో పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నాను`అని తెలిపారు మంచు విష్ణు.