
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘‘వ్యూహం’’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ను వర్మ తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్ర స్టిల్స్ విడుదల చేసిన ఆర్జీవీ.. తాజాగా టీజర్తో రాజకీయ వేడిని పెంచారు. ఏపీ సీఎం వైఎస్ జగన్పై అభిమానంతోని ఈ సినిమా తీస్తున్నానని ఆర్జీవీ ఇది వరకే స్పష్టం చేశారు. ఇటీవల సీఎం జగన్తో కూడా ఆర్జీవీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గతంలో వైసీపీకి మద్దతుగా కొన్ని చిత్రాలను తెరకెక్కించడంలో కీలక పాత్ర వహించిన ఆర్జీవీ.. ఇప్పుడు జగన్ను హీరోగా చూపించే కథనంతో వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
టీజర్ విషయానికి వస్తే.. హెలీకాఫ్టర్ ప్రమాదంలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి మరణించడంతో ఈ టీజర్ మొదలైంది. ఆ తరవాత.. వైఎస్సార్ కుటుంబంలో జరిగిన పరిణామాలు, ప్రతిపక్షాలు వ్యుహాలు పన్నాయని, జగన్ను సీబీఐ అరెస్ట్ చేయడం వంటి అంశాలతో.. టీజర్ ముందుకు సాగింది. సీబీఐ డౌన్ డౌన్ అంటూ చేసే నినాదాలను కూడా చూపించారు. చివరిలో అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు అంటూ జగన్ పాత్ర పోషించిన అజ్మల్ అమీర్ చెప్పడం టీజర్లో కనిపించింది.
అయితే ఈ చిత్రంలో ప్రధానంగా 2009లో జగన్ రాజకీయల్లో ప్రవేశించినప్పటి నుంచి చోటుచేసుకున్న అంశాలను ఆర్జీవీ తన యాంగిల్లో చూపించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని జనాలు ఎలా స్వీకరిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి రానున్న ఎన్నికల్లో ఏ మేరకు లబ్ది చేకూరుస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఏది ఏమైనా వర్మ.. ఈ టీజర్ను విడుదల చేయడంతో ఏపీలో రాజకీయ వేడిని మాత్రం పెంచాడనే చెప్పాలి.
ఇక, ఈ చిత్రాన్ని రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్నట్టుగా వర్మ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ వ్యూహం షాక్ నుంచి తేరుకునే లోపే సెకండ్ పార్ట్ శపథంతో మరో షాక్ ఇస్తానని కూడా వర్మ చెప్పారు. ఇక, ఈ చిత్రంలో మెయిన్ లీడ్ గా అయితే అజ్మల్ అమీర్ నటిస్తుండగా దాసరి కిరణ్ కుమార్ నిర్మాణం వహిస్తున్నారు.