మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ’.రంగస్దలం వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. బోయపాటి సైతం ఈ సినిమాని సూపర్ హిట్ చేసి చిరంజీవితో నెక్ట్స్ సినిమా చేయాలనే పట్టుదలలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం బ్యాక్ డ్రాప్ గురించి ఓ వార్త ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బీహార్ నేపధ్యంలో ఈ కథ జరుగుతుందని..తన అన్నయ్యను చంపిన వారిని వెతుక్కుంటూ రామ్ చరణ్ బీహార్ వెళతాడని, అక్కడ జరిగే ఫైట్స్ ఈ సినిమాకు ప్రత్యేకంగా నిలుస్తాయని చెప్తున్నారు. బీహార్ నుంచి వచ్చిన క్రిమినల్స్ ఎలా ఉంటారో మనం రోజూ చదువుతూంటాం...వింటూంటం..దాన్నే ఈ సినిమాలో ప్లే చేసాడని చెప్తున్నారు.
ఇక ఈ సినిమా టాకీ భాగం షూట్ పూర్తయిందని చిత్ర యూనిట్ ట్విట్టర్లో పేర్కొంది . ఈషా గుప్తాతో ప్రత్యేక పాటతో సహా రెండు పాటలు మిగిలి ఉన్నాయని, మొత్తం షూటింగ్ డిసెంబర్ 26 నాటికి పూర్తి అవుతుందని తెలిపింది.
డిసెంబర్ 17న సాయంత్రం 4 గంటలకు ఈ చిత్రం రెండో సింగిల్ ‘తస్సాదియ్యా’ను విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘తందానే తందానే’కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక డిసెంబర్ 24న లేదా 27వ తేదీన జరగనుంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అళాగే మాజీ హీరోలు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.