
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఫిల్మ్ ‘పఠాన్’(Pathaan). ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణె (Deepika Padukone) షారుఖ్ సరసన నటించింది. ప్రస్తుతం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందించే క్రమంలో రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ గా ‘Besharam Rang’ సాంగ్ ను విడుదల చేశారు.
ఈ నెల 12న విడుదలైన ఈ పాట వివాదాలకు దారి తీసింది. దీపికా పదుకుణె మరీ బికినీల్లో బోల్డ్ పెర్ఫామెన్స్ మెన్స్ చేయడం ఒకెత్తైతే.. కాషాయపు దుస్తులు ధరించి సాంగ్ లో నర్తించడం పట్ల హిందూ సంస్థలు ఆగ్రహిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని ఎగతాళి చేసేలా ఉందని, సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లను లెక్క చేయకుండా విడుదలచేస్తే ఆ థియేటర్లను తగలబెడుతామని కూడా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది.
ఈ క్రమంలో మధ్య ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ ఘాటు వ్యాఖ్యలు చేయడం మరింత దుమారం రేపింది. ఈ మేరకు బాలీవుడ్ మీడియా వార్తలు వెల్లడిస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ వివాదంపై స్పందించగా.. తాజాగా స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా నటుడు షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ను చిత్ర విడుదలను వ్యతిరేకించారని తెలిపారు. ‘షారూఖ్ తన కూతురితో కలిసి ఈ చిత్రాన్ని చూడాలి. తన కుమార్తెతో కలిసి చూస్తున్నట్లు ప్రపంచానికి తెలిసేలా ఒక ఫొటోలను కూడా అప్ లోడ్ చేయాలి.. అప్పుడు అనుమతి లభిస్తుంది. ఈ సందర్భంగా బహిరంగంగా ఓ సవాల్ చేస్తున్నా.. ప్రవక్త ముహమ్మద్పై అలాంటి సినిమా తీసి భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో విడుదల చేస్తారా?.. అలా చేస్తే ప్రపంచవ్యాప్తంగా రక్తపాతం జరుగుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు.
విమర్శలపై షారుఖ్ ఖాన్ కూడా మొన్న ట్వీటర్ వేదిక స్పందించారు. ‘పఠాన్ దేశభక్తి సినిమానే.. కానీ యాక్షన్ వేలో ఉంటుంది’ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సినిమాను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడం సినిమాపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. హిందీలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలోనూ డబ్డ్ వెర్షన్ లో రిలీజ్ కానుంది.