
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'గుంటూరు కారం'. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి షూటింగ్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటూ ఈ మధ్యనే ఊపందుకుంది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటికే మహేశ్ పాత్రకు సంబంధించిన లుక్ కూడా రిలీజై వైరల్ అయ్యింది. తాజాగా ఈ సినిమా గురించిన లీక్ బయిటకు వచ్చింది. అదేమిటంటే..ఈ సినిమాలో పొలిటికల్ నేపథ్యం కూడా ఉంటుంది. ఆ విషయాన్ని నిజం చేస్తూ తాజాగా ఓ పోస్టర్ లీక్ అయ్యింది.
ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫొటోలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయ నాయకుడిగా ఓ ఫ్లెక్సీ కనపడుతోంది. ఇది గుంటూరు కారం సినిమాలోని పోస్టర్ అని చెబుతున్నారు. ఈ ఫ్లెక్సీలో 'ప్రజాబంధు జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వైర వెంకట స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనదళం పార్టీ యువజన నాయకులు నిజమాబాద్ జిల్లా' అని అందులో రాసి ఉంది. అంటే ప్రకాశ్ రాజ్.. శ్రీ వైర వెంకట స్వామి అనే రాజకీయ నేతగా కనిపిస్తారని తెలుస్తోంది.
ఈ సినిమాకు 'గంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్ర కథ మొత్తం.. గుంటూరు చుట్టు పక్కల సాగుతుందని అంతా భావించారు. కానీ ప్రస్తుత పోస్టర్లో నిజమాబాద్ జిల్లా అని రాయడాన్ని చూసి ఆలోచనలో పడుతున్నారు. ఈ చిత్రంలో రెండు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ బ్యాక్డ్రాప్ కాస్త లైట్గా టచ్ చేస్తారని అనుకుంటున్నారు.
గుర్తుందో లేదో మొదట్లో ఈ సినిమాకు 'అమరావతికి అటు ఇటు' అనే టైటిల్ అయితే తెగ ట్రెండ్ అయింది. ఇక ఇదే సమయంలో ఏపీ పాలిటిక్స్లో రాజధాని విషయమై అమరావతి పేరు.. ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అందుకే ఈ పేరు వల్ల ఎటువంటి వివాదాలు తలెత్తకూడదని .. దాన్ని పక్కనపెట్టి 'గుంటూరు కారం' టైటిల్ను ఫిక్స్ చేసింది మూవీటీమ్ అని చెప్పుకున్నారు.