సినీ గీత రచయిత ముత్తు విజయన్ పచ్చ కామెర్ల బారిన పడడంతో కాలేయం పూర్తిగా దెబ్బతింది. దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ముత్తు విజయన్ శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో కన్నుమూశారు.
సినీ గీత రచయిత ముత్తు విజయన్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కవయిత్రి తేన్మొళిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ముత్తు. అయితే కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. దీంతో ముత్తు స్థానిక వలసరవాక్కంలోని సినీ గీత రచయితల సంఘ కార్యాలయంలో బస చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన పచ్చ కామెర్ల బారిన పడడంతో కాలేయం పూర్తిగా దెబ్బతింది. దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ముత్తు విజయన్ శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో కన్నుమూశారు. అదే రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిపించారు.
పలువురు ప్రముఖ నటుల చిత్రాలకు పాటలు రాసిన ముత్తు విజయన్.. స్టార్ హీరో విజయ్ నటించిన ' తుళ్లాద మనం తుళ్లుం' అనే సినిమా ద్వారా గీత రచయితగా పరిచయమయ్యారు. అందులో మెఘామాయ్ వందు పోగిరేన్, విన్నిలా ఉన్నైతేడినేన్ పాటలు ముత్తువిజయన్కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.
ఆ తరువాత పెన్నిన్మనదై తొట్టు చిత్రంలో కన్నుకుళ్లే ఉన్నై వైత్తేన్ పాట ముత్తువిజయన్ కి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఎనిమిది వందలకు పైగా పాటలు రాసిన ముత్తు కొన్ని సినిమాలకు మాటల రచయితగా కూడా పని చేశారు. అలానే సహాయ దర్శకుడిగా కూడా తన టాలెంట్ చూపించారు.