
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, యాక్షన్ సినిమాలకు పేరున్న దర్శకుడు అట్లీ తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ కాంబినేషన్ లో భారీ స్థాయిలో సినిమా రాబోతుందని అందరికీ తెలిసిందే. ఈ మూవీ ప్రారంభ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది.
ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా(AA22*AA6) గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనే నటిస్తున్నట్లు స్పెషల్ వీడియోతో తెలిపింది టీమ్. ఆ వీడియోలో దర్శకుడు అట్లీ కథ చెబుతుంటే దీపికా ఆసక్తిగా వింటుంది.
దీపికా నటించడానికి ఒప్పుకున్న తర్వాత, అట్లీ ఆమెతో టెస్ట్ షూట్ నిర్వహించారు. అందులో ఆమె చేతిలో కత్తితో యాక్షన్ సన్నివేశంలో నటిస్తున్నట్లు, కత్తితో గుర్రంపై దూసుకెళ్తున్నట్లు అట్లీకి నటించి చూపిస్తుంది.
ఇందులో దీపికా రెచ్చిపోయి కనిపించారు. యుద్ధ రంగంలోకి దూకడానికి రెడీ అయినట్టుగా ఆమె కనిపించారు. దీపికా రాకతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది.
ఇటీవలే ప్రభాస్ 'స్పిరిట్' సినిమా నుంచి దీపికా తప్పుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో విభేదాల కారణంగా ఆమె తప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే బడ్జెట్ పరంగా దాన్ని మించిన మూవీలో భాగం కావడం విశేషం.
ఈ సినిమా దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతోంది. సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్నారు. దీపికా, అట్లీ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇంతకు ముందు వీరిద్దరూ 'జవాన్' సినిమాలో కలిసి పనిచేశారు.
అట్లీ ఇప్పటికే విజయ్ తో 'తెరి', 'బిగిల్', షారుఖ్ తో 'జవాన్' వంటి హిట్ సినిమాలు తీసి పాన్ ఇండియా దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ ఇటీవల 'పుష్ప 2' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరిగాయి.
అయితే ఈ మూవీని అంతర్జాతీయ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దబోతున్నారు. సైన్స్ ఫిక్షన్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. మైథలాజికల్ టచ్ ఇస్తూనే సూపర్ హీరోల కథతో ఈ మూవీని రూపొందించబోతున్నట్టు తెలుస్తుంది. దీనికోసం అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. సినిమా వేరే లెవల్లో ఉండబోతుందని తెలుస్తుంది.