సింగర్ జి.ఆనంద్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తన విచారం వ్యక్తం చేశారు. గాయకుడు ఆనంద్ తన తొలి పాట తన సినిమాకే పాడారని చెబుతూ సంతాపం తెలియజేశారు.
ప్రముఖ గాయకుడు జి. ఆనంద్ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. ఆనంద్ హఠాన్మరణంతో సంగీత లోకమే కాదు, టాలీవుడ్ ప్రముఖులు సైతం దిగ్ర్భాంతికి గురయ్యారు. కరోనా చికిత్స సమయంలో వెంటిలేటర్ సరైన సమయంలో అందకపోవడం ఆయన మృతిచెందినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన విచారం వ్యక్తం చేశారు. గాయకుడు ఆనంద్ తన తొలి పాట తన సినిమాకే పాడారని చెప్పారు చిరంజీవి. `ఎన్నియల్లో.. ఎన్నీయల్లో.. ఎందాకా.. `అంటూ నా సినీ జీవితంలో తొలి పాటకి గాత్ర దానం చేయడం ద్వారా నాలో ఒక భాగమైన మృదు స్వభావి, చిరుదరహాసి జి.ఆనంద్ కర్కశమైన కరోనా బారిన పడి ఇకలేరని నమ్మలేకపోతున్నా. మొట్టమొదటిసారి వెండితెర మీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం, ఆయనతో నాకు అనిర్వచనీయమైన, అవినాభావ బంధం ఏర్పర్చింది. ఆయన ప్రస్థానం నన్ను వెన్నాడే విషాదం. ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నా` అని తెలిపారు చిరంజీవి. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Rest In Peace Sri. G.Anand Garu! pic.twitter.com/TrWnDaxUav
— Chiranjeevi Konidela (@KChiruTweets)