
ప్రైవేట్ సెక్టార్లో అతి పెద్ద బ్యాంక్గా ఉంటోన్న హౌసింగ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (హెచ్డీఎఫ్సీ).. తన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అంచనాలకు మించి రాణించింది. బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 22.8 శాతం మేర నెట్ ప్రాఫిట్ను నమోదు చేసింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన గత ఆర్థిక సంవత్సరం నాలుగు, చివరి త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 22.8 శాతం మేర నెట్ ప్రాఫిట్ను రికార్డు చేసింది.
ఈ సంవత్సరం జనవరి-ఫిబ్రవరి-మార్చి మధ్యకాలానికి 10,055.2 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ను నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఇదే కాలంతో పోల్చుకుంటే.. నెట్ ప్రాఫిట్ మరింత మెరుగుపడింది. 2020-2021 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 8,186.5 కోట్ల రూపాయలను నమోదు చేయగా.. ఈ ఏడాది అదే కాలానికి 10,055.2 కోట్ల రూపాయల ప్రాఫిట్ను అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికీ- అంటే నాలుగు త్రైమాసికాలను కలిపి ఆర్జించిన నికర ఆదాయం 36,961.3 కోట్ల రూపాయలు. అంతకుముందు నాటితో పోల్చుకుంటే 18.8 శాతం అధికం. చివరి త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలోనూ పెరుగుదల కనిపించింది. 10.2 శాతంతో 18,872.7 కోట్ల రూపాయలను రికార్డు చేసింది. నికర రెవెన్యూ, నికర వడ్డీ ఆదాయం వంటివి కలుపుకొంటే మొత్తంగా 25,509.8 కోట్ల మేర ఆదాయాన్ని అందుకుందీ బ్యాంకు.
బ్యాంక్ ఆధీనంలో ఉన్న నిరర్ధక ఆస్తుల విలువ 1.17గా నమోదైంది. మూడో త్రైమాసికంతో పోల్చుకుంటే ఇది కాస్త తక్కువే. హెచ్డీఎఫ్సీ బ్యాంకు వడ్డీ చెల్లింపులు-రాబడి మధ్య తేడా పెరిగింది. ఈ చివరి త్రైమాసికంలోనే దేశవ్యాప్తంగా కొత్తగా 563 బ్రాంచీలను నెలకొల్పినట్లు తెలిపింది. ఫలితంగా 7,167 మందికి ఉద్యోగావకాశాలను కల్పించినట్లు పేర్కొంది. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 734 బ్రాంచీలను ఏర్పాటు చేయడంతో పాటు 21,486 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు వివరించింది.
బ్యాంకు మొత్తం రుణాల్లో రిటైల్ రుణాలు 39 శాతంగా ఉన్నాయి. గతేడాది 47 శాతంతో పోలిస్తే కాస్త తగ్గాయి. ఇక పర్సనల్ లోన్లు 10 శాతంగా ఉన్నాయి. మొత్తం ఆస్తులతో పోలిస్తే కోర్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4 శాతంగా ఉంది. ఇతర ఆదాయం రూ.7,637 కోట్లుగా ఉందని కంపెనీ తెలిపింది. వడ్డీయేతర ఆదాయం 10.6 శాతంగా ఉంది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఇన్వెస్ట్మెంట్లను విక్రయించడం ద్వారా రూ.40.3 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించింది. ఇక డిపాజిట్ల గ్రోత్ 16.8 శాతం పెరిగి రూ.15.59 ట్రిలియన్లుగా ఉంది. కరెంట్, సేవింగ్స్ అకౌంట్ (కాసా) గ్రోత్ 22 శాతంగా ఉంది. మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్లు 48 శాతంగా ఉంది. 2021, మార్చిలోని 46 శాతంతో పోలిస్తే పెరిగింది.