శేఖర రావు సస్పెన్షన్: హుజూర్ నగర్లో ప్రజా పార్టీకి సిపిఎం మద్దతు
సీపీఎం నుండి పారేపల్లి శేఖర్ రావును సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సీపీఎం రాస్ట్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకొంది.
హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజా పార్టీకి సీపీఎం మద్దతును ప్రకటించింది. ఈ స్థానంలో సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరించడంతో తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థి సాంబశివగౌడ్ కు సీపీఎం మద్దతు ఇచ్చింది.
ఈ నెల 21న హుజూర్నగర్ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానానికి సీపీఎం అభ్యర్ధిగా పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ పత్రాల్లో సరైన పత్రాలు దాఖలు చేయని కారణంగా సీపీఎం అభ్యర్ధి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.
తమకు ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ఇటీవల కోరారు. అయితే ఆదివారం నాడు సీపీఎం రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై చర్చించారు.
రాష్ట్ర కార్యవర్గ నిర్ణయాన్ని పార్టీ కేంద్రకమిటీకి నివేదించారు.కేంద్ర కమిటీ సూచన మేరకు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బరిలో ఉన్న తెలంగాణ ప్రజా పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం నిర్ణయం తీసుకొంది.
మరో వైపు ఈ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో పారేపల్లి శేఖర్ రావును సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. అంతేకాదు సీపీఎం జిల్లా కమిటీ బాధ్యతల నుండి సూర్యాపేట జిల్లా కార్యదర్శి రాములు నుండి తప్పించారు.