చంద్రబాబు వర్సెస్ కేసీఆర్: తెలంగాణ సెంటిమెంట్ పండింది
కాంగ్రెసును అడ్డం పెట్టుకుని తెలంగాణలో ఆధిపత్యం, పెత్తనం చెలాయించడానికి చంద్రబాబు ముందుకు వస్తున్నారంటూ కేసిఆర్ సహా మంత్రులు హరీష్ రావు, కేటీ రామారావు పదే పదే విమర్శిస్తూ వచ్చారు. ఆంధ్ర పార్టీ మనకు అవసరమా అని కేసీఆర్ నేరుగా ప్రశ్నిస్తూ వచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మధ్య సమరంగా మార్చడంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) విజయం సాధించింది. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ అతి పెద్ద పార్టీ అయినప్పటికీ ఎన్నికల సమరాన్ని కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా మార్చడంతో సెంటిమెంట్ రగులుకుందనే చెప్పాలి.
కాంగ్రెసును అడ్డం పెట్టుకుని తెలంగాణలో ఆధిపత్యం, పెత్తనం చెలాయించడానికి చంద్రబాబు ముందుకు వస్తున్నారంటూ కేసిఆర్ సహా మంత్రులు హరీష్ రావు, కేటీ రామారావు పదే పదే విమర్శిస్తూ వచ్చారు. ఆంధ్ర పార్టీ మనకు అవసరమా అని కేసీఆర్ నేరుగా ప్రశ్నిస్తూ వచ్చారు. కేసీఆర్ తన ప్రచార సభల్లో చంద్రబాబును లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారు.
చంద్రబాబు ఆధిపత్యం తెలంగాణకు చేటు చేస్తుందని ఆయన తెలంగాణ ప్రజలను నమ్మించడంలో విజయం సాధించారనే చెప్పాలి. చంద్రబాబుపై గురి పెట్టడం ద్వారా కాంగ్రెసును ద్వితీయ స్థానంలోకి కేసీఆర్ నెట్టేశారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు ఆయన కాంగ్రెసును తప్పు పడుతూ వచ్చారు.
తెలంగాణను తెచ్చకుంది ఇందుకా అని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు పెత్తనాన్ని మళ్లీ తెచ్చిపెట్టుకోవడానికి తెలంగాణ తెచ్చుకున్నామా అని ఆయన ప్రశ్నించారు. దీంతో తెలంగాణ సెంటిమంట్ ను ఆయన రగిలించారు. తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నిర్వహించిన పాత్రను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని దాన్ని బట్టి అర్థమవుతోంది.