కేసీఆర్ పై వైస్రాయ్ వ్యాఖ్యలు: చంద్రబాబుపై జగదీష్ రెడ్డి నిప్పులు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అణువణువు వ్యతిరేకించిన చంద్రబాబుతో సైతం జై తెలంగాణ అనిపించామని జగదీష్ చెప్పారు. తెలంగాణను ఎంతలా వ్యతిరేకించినా ఆయన చేత జై తెలంగాణ అనిపించామని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అణువణువు వ్యతిరేకించిన చంద్రబాబుతో సైతం జై తెలంగాణ అనిపించామని జగదీష్ చెప్పారు. తెలంగాణను ఎంతలా వ్యతిరేకించినా ఆయన చేత జై తెలంగాణ అనిపించామని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రం కోసం అవసరమైతే గొంగళిపురుగును ముద్దాడతా, కుష్టురోగులను సైతం కౌగిలించుకుంటామని ఆనాడు తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలోనే చెప్పారని అందుకే గొంగళిపరుగు, కుష్టురోగి అయిన తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకున్నామని స్పష్టం చేశారు.
2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోసం కేసీఆర్ ఏనాడు వెంపర్లాడలేదని గుర్తు చేశారు. 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని రెండు రాష్ట్రాల ప్రజలు తిరస్కరిస్తే బుద్ది తెచ్చుకుని 2009లో మాతో పొత్తు పెట్టుకున్నావ్ అని విమర్శించారు.
2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తును తెలంగాణ ప్రజలు హర్షించలేదని అయితే రాజకీయ పార్టీతో తప్పదని పెట్టుకున్నామన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పించాలని ఉద్దేశంతో నీతో పొత్తుపెట్టుకుని కేసీఆర్ విజయం సాధించారని తెలిపారు. అందుకే ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరంతో లేఖ ఇప్పించుకున్నామన్నారు.
కేసీఆర్ రాజకీయ జీవితంలో చంద్రబాబు వెంట తిరగలేదని చంద్రబాబు నాయుడే కేసీఆర్ వెంట తిరిగాడన్నారు. పొత్తుకోసం పాకులాడింది చంద్రబాబు నాయుడే తప్ప కేసీఆర్ కాదన్నారు. తాము సీట్ల కోసం చంద్రబాబు చుట్టూ తిరిగాము అన్నది అవాస్తవమన్నారు.
మరోవైపు రాజకీయాల్లో కేసీఆర్ ఏనాడు మాట తప్పలేదన్నారు. ఆది నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2009లో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించారన్నారు.
చంద్రబాబు నాయుడు మాత్రం ఏనాడు మాట మీద లేరని విరుచుకుపడ్డారు. తమ నాయకుడు కేసీఆర్ జై తెలంగాణ అనేవారు అంటున్నారని కానీ చంద్రబాబు జై సమైక్యాంధ్రప్రదేశ్ అన్న నోటితోనే జై తెలంగాణ అన్నారని విరుచుకుపడ్డారు.
కేసీఆర్ అన్ని అంశాల్లో తానే ఏదో చేశానని తాను గొప్పోడినని అనుకుంటూ సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటమీద నిలకడ లేని వ్యక్తి అని అలాంటి నాయకుడు ఉండటం దురదృష్టకరమన్నారు.
ఇకపోతే వైశ్రాయ్ లో హోటల్ జరిగిన ఘటనకు కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అసలు వైశ్రాయ్ ఘటనకు కేసీఆర్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని గుంజుకున్నది చంద్రబాబు నాయుడా కాదా అని ప్రశ్నించారు.
అయితే వైశ్రాయ్ ఘటనలో కేసీఆర్ కీలక పాత్ర పోషించి, తెలుగుదేశం పార్టీని గుంజుకొచ్చి చంద్రబాబుకు ఇచ్చినట్లు మాట్లాడుతున్న చంద్రబాబు అసలు నీకు సిగ్గుందా అంటూ విరుచుకుపడ్డారు. వైశ్రాయ్ ఘటనలో కేసీఆర్ పాత్ర ఉంటే చంద్రబాబు నాయుడు ఎందుకు సీఎం అవుతారంటూ ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం కావచ్చు కదా అని గుర్తు చేశారు.
18 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనను తెరపైకి తీసుకువచ్చి చంద్రబాబు నాయుడు మరో డ్రామాకు తెరలేపారన్నారు. ఆనాడు ఈనాడు ఏనాడు కూడా కేసీఆర్ మాట తప్పలేదన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పూట పూటకు మాటతప్పతున్నారని విమర్శించారు.